Ashok Babu: ఈ పీఆర్సీతో ఉద్యోగులకు రూపాయి ప్రయోజనం లేదు.. ఏం సాధించారని అభినందిస్తున్నారు?: ఉద్యోగ సంఘాలపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ధ్వజం

  • ఫిట్ మెంట్ తదితర అంశాలపై సీఎం జగన్ ప్రకటన
  • ఉద్యోగులను వంచించారన్న అశోక్ బాబు
  • 27 శాతం ఫిట్ మెంట్ ను 23 శాతానికి తగ్గించారని వ్యాఖ్య 
  • ఉద్యోగ సంఘాలను తప్పుబట్టిన వైనం
  • ఎలా అంగీకరించారన్న అశోక్ బాబు
TDP MLC Ashok Babu opines on PRC announcement

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం 23 శాతం ఫిట్ మెంట్, పీఆర్సీ ప్రకటించడంపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు స్పందించారు. ఉద్యోగులకు రూపాయి ప్రయోజనం లేదని పెదవి విరిచారు. గతంలో రోశయ్య సర్కారు హయాంలో 39 శాతం ఫిట్ మెంట్ ఇచ్చారని, ఆ సమయంలో ఉద్యోగులకు రూ. 3,200 మేర ప్రయోజనం లభించిందని అన్నారు. హెచ్ఆర్ఏ అంశంలోనూ లబ్ది పొందారని వివరించారు. కానీ ఇవాళ ఏ ప్రయోజనాన్ని ఆశించి ఈ ఫిట్ మెంట్ కు ఉద్యోగ సంఘాలు అంగీకారం తెలిపాయి? అని ప్రశ్నించారు.

ఈ ఫిట్ మెంట్ మాకు నచ్చలేదని సీఎం ముఖానే చెప్పి రావాల్సిందని ఉద్యోగ సంఘం నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. కానీ సిగ్గులేకుండా తప్పెట్లు కొట్టి అభినందనలు తెలిపి వస్తున్నారని అశోక్ బాబు విమర్శించారు. ఏం సాధించారని అభినందిస్తున్నారు? అంటూ నిలదీశారు.

"నేనేమీ టీడీపీ ఎమ్మెల్సీగానో, ఇంకో విధంగానో మాట్లాడడంలేదు. నేను ఈ రాష్ట్రంలో పింఛను అందుకుంటున్నాను. తాజా నిర్ణయం వల్ల నా పెన్షన్ రూ.1500 మేర తగ్గిపోయింది. అందుకు మీ అసమర్థతే కారణం. పెన్షన్ తగ్గించే హక్కు మీకెక్కడుంది? ఉద్యోగ సంఘాల నాయకులు దీనికి బాధ్యత తీసుకుంటారా? ఇది కచ్చితంగా వంచనే. ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్పాలి" అని అశోక్ బాబు ధ్వజమెత్తారు.

ఈ పీఆర్సీతో రిటైరయ్యే ఉద్యోగులకు కచ్చితంగా నష్టం జరుగుతుందని అన్నారు. ఇవాళ ఉద్యోగంలో చేరిన వ్యక్తి కూడా కొత్త జీతశ్రేణిలో ఒక ఇంక్రిమెంటు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, మరి 15 నుంచి 20 ఏళ్లుగా ఉద్యోగంలో ఉన్నవారు ఎంతమేర నష్టపోతారన్నది రేపు ప్రభుత్వం జీవో ఇస్తే గానీ తెలియదు అని అశోక్ బాబు వ్యాఖ్యానించారు.

ఫిట్ మెంట్ పై రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామన్న నిర్ణయం ఒకరోజులోనే ప్రకటించినప్పుడు, సీపీఎస్ పై నిర్ణయానికి ఆర్నెలు ఎందుకు? అని ప్రశ్నించారు. సీపీఎస్ గురించి తేల్చడానికి జూన్ దాకా ఎందుకని అన్నారు. ఈసారి చవకబారు పీఆర్సీ తీసుకువచ్చారని, అలా ఎందుకంటున్నామంటే ప్రతిసారి పీఆర్సీతో ఎంతోకొంత ప్రయోజనం కలుగుతుందని, ఈసారి పీఆర్సీతో ఉద్యోగస్తులకు రూపాయి కూడా బెనిఫిట్ లేదని విమర్శించారు.

ఇదొక దుర్మార్గమైన నిర్ణయం అని, ఉద్యోగుల పట్ల వంచనకు పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులు ఫిట్ మెంట్ తప్ప అన్నీ బాగున్నాయని వక్రభాష్యం చెబుతున్నారని అశోక్ బాబు ఆరోపించారు. అసలు ఉద్యోగులకు కావాల్సిందే ఫిట్ మెంట్ అని స్పష్టం చేశారు. కానీ, 27 శాతం నుంచి 23 శాతానికి తగ్గిస్తే ఉద్యోగ సంఘాల నాయకులకు తెలియకపోవడం దురదృష్టకరమని, రిటైరయ్యే ఉద్యోగులకు దీనివల్ల నష్టం కలుగుతుందని అన్నారు.

More Telugu News