Huzurabad: భర్త ఇంటి ఎదుట నెలన్నర రోజులుగా దీక్ష.. చివరికి ఆత్మహత్య

  • హుజూరాబాద్ అబ్బాయితో కడప జిల్లా యువతికి ఆన్‌లైన్‌లో పరిచయం
  • నవంబరు 2020లో హైదరాబాద్ ఆర్య సమాజ్‌లో పెళ్లి
  • కొన్నాళ్ల కాపురం తర్వాత వెళ్లిపోయిన భర్త
  • నవంబరు 26 నుంచి భర్త ఇంటి వద్ద దీక్ష
Kadapa woman commit suicide in Huzurabad husbands home

తన భర్త తనకు కావాలంటూ గత 42 రోజులుగా అతడి ఇంటి ఎదుట దీక్ష చేస్తున్న ఓ వివాహిత చివరికి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. హుజూరాబాద్‌కు చెందిన సుజిత్ హనుమకొండలోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్న సమయంలో కడప జిల్లాకు చెందిన ఆవుల సుహాసిని (34)తో ఆన్‌లైన్ ద్వారా పరిచయమైంది. ఈ పరిచయం ప్రేమగా మారడంతో 25 నవంబరు 2020లో హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు.

కొన్ని రోజుల కాపురం తర్వాత సుజిత్ చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు. దీంతో భర్త కోసం వెతుకులాట ప్రారంభించిన సుహాసిని చివరికి ఎలాగోలా అతడి అడ్రస్ కనుక్కుని హుజూరాబాద్ చేరుకుంది. తనకు తన భర్త కావాలని, అతడిని తనతో పంపించాలని కోరుతూ గతేడాది నవంబరు 26న అత్తింటి వద్ద దీక్ష చేపట్టింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులనూ ఆశ్రయించింది.

అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో తన భర్తకు మళ్లీ పెళ్లి అయిందని, అతడికి పిల్లలు కూడా ఉన్నారని తెలియడంతో తీవ్ర మనస్తాపం చెందిన సుహాసిని బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆమెను వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న ప్రాణాలు విడిచింది. తన ఆత్మహత్యకు భర్త సుజీత్, అత్త పద్మ, కల్యాణి, మామ శ్రీనివాసరెడ్డి, మరిది సుహాస్‌రెడ్డి కారణమంటూ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News