RGV: మీకు, మీ డ్రైవర్ కి కూడా తేడా లేదా?: ఏపీ మంత్రి పేర్ని నానికి ఆర్జీవీ మ‌రోసారి కౌంట‌ర్లు

  • మీరు పరుష పదజాలంతో మాట్లాడలేదు.. థ్యాంక్స్
  • దనికుల్ని పేదలను చెయ్యకూడదు
  • అలా చేస్తే ఏపీలో ఇండియాలోనే పేద రాష్ట్రం అయ్యే ప్రమాదం
  • పవన్, సంపూర్ణేశ్‌ బాబు సినిమాల‌కి తేడా లేదా?
  • మీ గవర్నమెంట్ లో ఉన్న థియేటర్ ఓనర్లతో ఓ సారి మాట్లాడండి
rgv on cinema tickets

ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌లను తగ్గించ‌డంపై ఏపీ మంత్రి పేర్ని నానిని ఆర్జీవీ ప్ర‌శ్నించ‌గా, స‌దరు మంత్రి స‌మాధానాలు ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే, పేర్ని నాని ఇచ్చిన ప్ర‌తి స‌మాధానంలోనూ లోపాల‌ను ఎత్తిచూపుతూ ఆర్జీవీ వ‌రుస‌గా కౌంట‌ర్లు ఇచ్చారు.

'థ్యాంక్యూ నాని గారు.. చాలా మంది లీడర్లలా పరుష పదజాలంతో మాట్లాడకుండా డిగ్నిటీతో సమాధానం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండీ.. ఇక విషయానికి వస్తే వంద రూపాయల టికెట్ ని వెయ్యికి అమ్ముకోవచ్చా? అన్నది క్వశ్చన్ కాదండీ.. అది అమ్మేవాడి నమ్మకం.. కొనేవాడి అవసరం బట్టి ఉంటుంది.

పేదల కోసం చెయ్యడం అనే మీ ఉద్దేశం మంచిది కావచ్చు.. కానీ దానికోసం పేద‌వారిని ధనికుల్ని చెయ్యటానికి మీ ప్రభుత్వం పని చెయ్యాలి.. కానీ, ఉన్న దనికుల్ని పేదలను చెయ్యకూడదు. అలా చేస్తే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో కల్లా పేద రాష్ట్రం అయ్యే ప్రమాదముంది.

నేనడిగే ముఖ్య ప్రశ్న టికెట్ ధర నిర్ణయించటానికి ప్రభుత్వం ఎవరని? పవన్ కల్యాణ్ సినిమాకి, సంపూర్ణేశ్‌ బాబు సినిమాకి మీ ప్రభుత్వంలో తేడా లేనప్పుడు మంత్రిగా మీకు, మీ డ్రైవర్ కి కూడా తేడా లేదా?

థియేటర్‌లో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని మాత్రమే 1970 సినిమాటోగ్రఫీ చట్టం ద్వారా వచ్చిన నిబంధనలు చెపుతున్నాయని మీరన్నది 100 శాతం కరెక్ట్. అలాంటప్పుడు V EPIC థియేటర్లో ఉన్న సౌకర్యాలను చూడకుండా ఆ థియేటర్ ఉన్న ఏరియాను బట్టి టికెట్ ప్రైజ్ ఎలా పెట్టారు? ఈ కింది ట్వీట్ లో మీరు చెప్పింది మీకు అర్థమైతే ఇంక సమస్య లేనట్టే.. వివిధ హోటళ్ల‌లో ఆ హోటల్ వాళ్లు, వాళ్లిచ్చే సౌకర్యాలను బట్టే ప్రైజ్ లిస్ట్ పెట్టుకుంటారు.

రేట్ లు తగ్గిస్తున్నది పేదవాడికి అందుబాటులో ఉండాలని.. ఎందుకంటే సినిమాని నిత్యావసర వస్తువుగా పరిగణిస్తున్నాము అని చెప్పింది మీ నాయకులే.. అది కానప్పుడు అసలు ఈ డిస్కషన్ ఎందుకు ఇష్యూ లేనప్పుడు?' అంటూ వర్మ ప్రశ్నించారు.   

బలవంతంగా ధరలు తగ్గిస్తే మోటివేషన్‌ పోతుందన్నది ఎకనామిక్స్‌లో ప్రాథమిక సూత్రం అని చెప్పారని, ఈ సూత్రం ఎవరికి వర్మగారూ? అంటూ పేర్ని నాని ప్ర‌శ్నించిన విష‌యం తెలిసిందే. ప్రొడ్యూసర్స్‌ శ్రేయస్సు గురించే మాట్లాడుతూ క‌స్ట‌మ‌ర్ల‌ యాంగిల్‌ను గాలికి వదిలారని, కాస్త ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండి వర్మ గారూ అంటూ నాని చేసిన ట్వీట్‌కు వ‌ర్మ స‌మాధానం ఇచ్చారు.

'అలా కోరుకునేది అందరి కన్నా బెటర్ అవ్వాలనే ఒక మోటివేషన్ తో.. ఆ బెటర్ గా ఉన్నప్పుడు వచ్చే అదనపు సౌఖ్యాలని కట్ చేసినప్పుడు మనిషికి మోటివేషన్ పోతుంది.. కమ్యూనిజం ఘోరంగా ఫెయిల్ అయ్యింది అక్కడే' అని వ‌ర్మ చెప్పారు.

'సొసైటీ ఆధునీకతకి ముఖ్య కారణం మోటివేషన్.. ఎందుకంటే ప్రతి మనిషి కూడా మానవ సహజంగా ఉన్న పొజిషన్ కన్నా ఎదగాలని కోరుకుంటాడు.. పేదవాడు ధనికుడవ్వాలని కోరుకుంటాడు, సైంటిస్ట్ ఎవ్వరూ కనిపెట్టలేనిది కనిపెట్టాలనుకుంటాడు. మీ పార్టీ కార్యకర్త మీలా మంత్రి అవ్వాలని కోరుకుంటాడు' అని వ‌ర్మ తెలిపారు.

మీ గవర్నమెంట్ లో ఉన్న థియేటర్ ఓనర్లని అడగండి
'1905, జూన్ 19న నికెలోడియోన్ అనే ప్రపంచంలోనే మొట్ట మొదటి థియేటర్ అమెరికాలో పెట్టినప్పటి నుంచి ఈనాటి వరకూ అవి కేవలం బిజినెస్ కోసం పెట్టిన వ్యాపార సంస్థలు.. అంతే కానీ ప్రజా సేవ నిమిత్తం ఎప్పుడూ ఎవ్వరూ పెట్టలేదు.. కావాలంటే మీ గవర్నమెంట్ లో ఉన్న థియేటర్ ఓనర్లని అడగండి' అని ఆర్జీవీ చురకంటించారు.

'థియేటర్లనేవి ప్రజా కోణంలో వినోద సేవలందించే ప్రాంగణాలు అని చెప్పారు. అలా అని ఏ ప్రజలు చెప్పారో వాళ్ల పేర్లు చెప్పగలరా? లేకపోతే రాజ్యాంగంలో కానీ సినిమాటోగ్రఫీ యాక్ట్ లో ఈ డెఫినిషన్ ఉందా. మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని సమర్థించుకోవటానికి, ఆ డెఫినిషన్ మీకు మీరు ఇచ్చుకుంటున్నారు' అన్నారు ఆర్జీవీ.

'సారీ నాని గారు, లూటీ అనే పదం ఉపయోగించేది బలాన్ని ఉపయోగించి క్రిమినల్ గా లాక్కున్నప్పుడు . అమ్మేవాడు కొనేవాడు పరస్పరం అంగీకరించుకుని చేసుకునే దాన్ని ట్రాన్సాక్షన్ అంటారు. ఆ ట్రాన్సాక్షన్ లీగల్ గా జరిగినప్పుడు గవర్నమెంట్ వాటా టాక్స్ రూపంగా తానంతట తనే వస్తుంది.

గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనేది కొన్ని విపరీత పరిస్థితుల్లో బియ్యం, గోధుమ లాంటివి ఉత్పత్తి ఎక్కువయిపోయి ధర పడిపోయినప్పుడు.. లేదా ఉత్పత్తి తక్కువయిపోయి ధర విపరీతంగా పెరిగిపోయినప్పుడు కానీ ఉంటుంది. అలాంటి విపరీత పరిస్థితి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ లో కానీ ప్రేక్షకులలో కానీ ఎక్కడ వచ్చిందండీ?' అని వ‌ర్మ నిల‌దీశారు.

'ఉదాహరణకి మీకు తెలుసో తెలియదో ముంబై, ఢిల్లీలలో వీక్ డే బట్టి, థియేటర్ బట్టి, ఏ సినిమా అనేదాన్ని బట్టి టికెట్ ధ‌ర‌లు 75 రూపాయల నుంచి 2,200 రూపాయల వరకూ వేరీ అవుతాయి. వీటన్నింటినీ నియంత్రించేది కేవలం ఓల్డెస్ట్ ఎకనామిక్ థియరీ డిమాండ్ అండ్ సప్లై' అని వ‌ర్మ వివ‌రించి చెప్పారు.

'కొనేవాడికి అమ్మేవాడికి మధ్య ట్రాన్సాక్షన్ ఎంతకి జరిగిందనే ట్రాన్స్పరెన్సీ మాత్రమే ప్రభుత్వాలకి అవసరం. ఎందుకంటే వాళ్ల‌కి రావాల్సిన టాక్స్ కోసం. బ్లాక్ మార్కెటింగ్ అనేది గవర్నమెంట్ కి తెలియకుండా చేసే క్రైమ్ ..ఓపెన్ గా ఎంతకి అమ్ముతున్నాడో చెప్పి అమ్మితే అది తప్పెలా అవుతుంది?' అని వ‌ర్మ ప్ర‌శ్నించారు.

'కొనేవాడుంటే 500 రూపాయ‌లు కూడా ఖర్చవ్వని పెయింటింగ్ ని కూడా 5 కోట్ల రూపాయ‌ల‌కి అమ్ముతారు. ముడి పదార్థానికి మాత్రమే వాల్యూ ఇస్తే బ్రాండ్ కి, ఐడియాకి ఎలా వెల కడతారు? క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఇంకా బెటర్ గా ఉండేలా ప్రయత్నించడం. బెటరా? కాదా? అనేది కొనుగోలుదారుడు నిర్ణయిస్తాడు' అని వ‌ర్మ తెలిపారు.

'నీళ్లు లేని పరిస్థితి ఉన్నప్పుడు గ్లాస్ నీళ్లు రూ.5 లక్షలకి కొనచ్చు. అది పరిస్థితిని దోపిడీ చేయ‌డమ‌ని అనుకుంటే మార్కెట్ ఉన్నదే దానికి.. కార్ కావాలనే కోరికని దోపిడీ చెయ్యడానికే లగ్జరీ కార్లు చేసి ఆకర్షిస్తారు. తప్పని అడ్డు కట్ట వేస్తే మనం ఇప్పటికీ కాలి నడకన తిరుగుతూ ఉండేవాళ్లం' అని వ‌ర్మ చెప్పారు.

'నేను యావరేజ్ ఇంజినీరింగ్ స్టూడెంటును.. ఎకనామిక్స్ గురించి నాకు ఏ, బీ, సీ తెలియదు.. కానీ అనుమతిస్తే మీ ప్రభుత్వంలో టాప్ ఎకనామిక్స్ నిపుణుల‌తో నేను టీవీ డిబేట్ కి రెడీ.. మా సినిమా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి ఏర్పడ్డ మిస్ అండ‌ర్‌స్టాండింగ్‌ తొలగిపోవడానికి అవసరం. థ్యాంక్యూ.

చివరిగా పేర్ని గారు, మీ పార్టీలో కొందరు మిగతా లీడర్లలాగా అడ్డంగా తిట్లతోనో పర్సనల్ విషయాల మీద దూకడం కాకుండా డిగ్నిటీతో సామరస్యం పాటించినందుకు ఇంకోసారి నా ధన్యవాదాలు. ఒక అంగీకారం అనేది లాజిక్ ఇచ్చిపుచ్చుకున్నప్పుడే వస్తుంది' అంటూ వర్మ ముగించారు. 

More Telugu News