Andhra Pradesh: మా పార్టీ కాకపోయినా రాధా భద్రత కోసం గన్ మెన్లను పంపించాం.. రాధా హత్య రెక్కీ అంశంపై మంత్రి వెల్లంపల్లి

  • రంగాను హత్య చేసిన టీడీపీతోనే రాధా అంటకాగుతున్నారు
  • గన్ మెన్లను పంపిస్తే తిప్పి పంపి రాజకీయాలు చేస్తున్నారు
  • రాధా ఇల్లు మెయిన్ రోడ్డులో ఉంది
  • అక్కడ కారు తిరిగితే రెక్కీ అవుతుందా?
  • చంద్రబాబు తప్పుడు డైరెక్షన్ లో రాధా వెళ్లొద్దంటూ కామెంట్
Minister Vellampalli Fires On Vangaveeti Radha

వంగవీటి రాధాపై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. టీడీపీ హయాంలో వంగవీటి రంగా హత్య జరిగితే.. ఇప్పుడు అదే పార్టీతో ఆయన తనయుడు రాధా అంటకాగుతున్నారని అన్నారు. టీడీపీ హయాంలో రంగా ఎందుకు దీక్ష చేశారో తెలుసుకోవాలని సూచించారు. హత్యకు రెక్కీ చేశారంటూ ఆరోపిస్తున్న నేతలు.. ఇంతకీ పోలీసులకు ఫిర్యాదు చేశారా? అని ప్రశ్నించారు. రెక్కీపై ఆధారాలుంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రెక్కీ ఎవరు చేశారో రాధా చెప్పాలన్నారు.

రాధా ఇల్లు మెయిన్ రోడ్డుపై ఉందని, అక్కడ కారు తిరిగితే రెక్కీ అవుతుందా? అని మండిపడ్డారు. హత్య..రెక్కీ అంటూ హడావుడి చేశారని, భద్రత కోసం ప్రభుత్వం గన్ మెన్లను పంపితే మాత్రం తిప్పి పంపించేసి రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధా రెక్కీ అంశంపై వెంటనే సీఎం జగన్ స్పందించారని గుర్తు చేశారు. రాధా తమ పార్టీకి చెందిన వ్యక్తి కాకపోయినప్పటికీ గన్ మెన్లను కేటాయించారన్నారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు చెప్పినట్టు చేయొద్దని, చంద్రబాబు తప్పుడు డైరెక్షన్ లో ముందుకు వెళ్లొద్దని రాధాకు చెప్పారు. ఇప్పటికే రాధాను రాజకీయాల్లో మరచిపోయారని ఎద్దేవా చేశారు.

More Telugu News