Asaduddin Owaisi: అదే జరిగితే అసదుద్దీన్ ఒవైసీ జంధ్యం ధరిస్తారు: యూపీ మంత్రి భూపేంద్ర సింగ్

  • యోగి ఆదిత్యనాథ్ మరోసారి సీఎం అయితే ఒవైసీ జంధ్యం ధరిస్తారు
  • రామనామాన్ని ఒవైసీ జపిస్తారు
  • ఇప్పటికే రాహుల్, అఖిలేశ్ యాదవ్ మమ్మల్ని అనుసరిస్తున్నారు
Asaduddin Owaisi Will Wear Janeu If Yogi  Returns To Power says UP Minister

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని ఉద్దేశించి యూపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి భూపేంద్ర సింగ్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. యోగి ఆదిత్యనాథ్ మరోసారి యూపీ ముఖ్యమంత్రి అయితే... హిందువులు ఎంతో పవిత్రంగా భావించే జంధ్యాన్ని ఒవైసీ ధరిస్తారని చెప్పారు. ఒవైసీ రామనామాన్ని జపిస్తారని అన్నారు. బీజేపీకి ఒక అజెండా ఉందని... ఆ అజెండాతో తాము ముందుకు సాగుతామని భూపేంద్ర తెలిపారు.

ఈ అజెండా వల్లే సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ హనుమాన్ ఆలయాలకు వెళ్లి ప్రార్థనలు చేయడాన్ని ఆరంభించారని చెప్పారు. ఈ అజెండా వల్లే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జంధ్యాన్ని ధరించి, అందరికీ తన గోత్రం ఏమిటో చెప్పడాన్ని ప్రారంభించారని అన్నారు. తన అజెండా కారణంగానే వీళ్లంతా వాళ్ల అజెండాలను పక్కన పెట్టి మమ్మల్ని అనుసరించడం ప్రారంభించారని చెప్పారు.

కేవలం మైనార్టీల గురించి మాత్రమే మాట్లాడేవారు, రాముడు అనే వ్యక్తి కేవలం ఒక ఊహాజనిత వ్యక్తి మాత్రమే అని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన వాళ్లు కూడా జంధ్యాన్ని ధరించి, దేవాలయాలను సందర్శిస్తారని భూపేంద్ర అన్నారు. యూపీలో బీజేపీ మరోసారి గెలిచి, యోగి మరోసారి సీఎం అయితే ఒవైసీ జంధ్యాన్ని ధరిస్తారని జోస్యం చెప్పారు. మరోవైపు త్వరలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ 100 స్థానాల్లో పోటీ చేస్తుందని ఇప్పటికే ఒవైసీ ప్రకటించారు.

More Telugu News