Singireddy Niranjan Reddy: బాధ్యతలను విస్మరించిన కేంద్రం రాష్ట్రాలపై దాడి చేస్తోంది: తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి

  • రగులుతున్న ధాన్యం కొనుగోలు అంశం
  • కేంద్రం వర్సెస్ తెలంగాణ
  • సమస్య పరిష్కారం కోసం పడిగాపులు కాస్తున్నామన్న మంత్రి
  • ఢిల్లీకి వచ్చిన మంత్రులను అవమానిస్తున్నారని ఆగ్రహం
Telangana minister Niranjan Reddy fires on Centre

ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంతో తెలంగాణ సర్కారు పోరాటం కొనసాగుతోంది. ధాన్యం సేకరణ అంశాన్ని ఓ కొలిక్కి తెచ్చేందుకు ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నామని, రెండ్రోజుల్లో నిర్ణయం చెబుతామన్న కేంద్రం ఇంతవరకు స్పందించలేదని రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు.

మేం ఢిల్లీకి వచ్చింది ప్రేమలేఖలు రాయడానికి అన్నట్టుగా కేంద్రమంత్రుల వైఖరి ఉందని విమర్శించారు. ఏ ఒక్క అంశంలోనూ కేంద్రం నుంచి సరైన రీతిలో సాయం అందడంలేదని అన్నారు. బాధ్యతలను విస్మరించిన కేంద్రం రాష్ట్రాలపై దాడి చేస్తోందని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.

"ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అదే సమయంలో బ్యాంకు రుణాల ఎగవేతకు పాల్పడిన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నారు. ఇంకెవ్వరూ వ్యవసాయాన్ని వృత్తిగా చేపట్టని రీతిలో నిరుత్సాహకరంగా వ్యవహరిస్తున్నారు. ఆఖరికి జీఎస్టీ నిధులను కూడా అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అడిగేందుకు వచ్చిన మంత్రులను అవమానిస్తున్నారు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రం విధానాలతో రైతులు బాధపడుతున్నారని, కార్పొరేట్ సంస్థలకు దగ్గరుండి ఒప్పందాలు కుదుర్చుతున్న ప్రభుత్వం రైతులను మాత్రం పట్టించుకోవడంలేదని విమర్శించారు.

More Telugu News