CM Jagan: బద్వేలులో సెంచరీ ఫ్లైబోర్డ్స్ పరిశ్రమ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది: సీఎం జగన్

  • కడప జిల్లాలో సీఎం జగన్ మూడ్రోజుల పర్యటన
  • ప్రొద్దుటూరులో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం
  • సెంచరీ ఫ్లైబోర్డ్స్ పరిశ్రమ శిలాఫలకం ఆవిష్కరణ
  • బద్వేలు అభివృద్ధి పథంలో పయనిస్తుందని వెల్లడి
CM Jagan inaugurates Century Flyboards plant in Badvel

ఏపీ సీఎం జగన్ మూడ్రోజుల పర్యటన నిమిత్తం నేడు కడప జిల్లా వెళ్లారు. ప్రొద్దుటూరులో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. బద్వేలు సమీపంలోని గోపవరం వద్ద సెంచరీ ఫ్లైబోర్డ్స్ పరిశ్రమ ఏర్పాటుకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బద్వేలులో సెంచరీ ఫ్లైబోర్డ్స్ ప్లాంట్ ఏర్పాటు కావడం హర్షణీయమని పేర్కొన్నారు. బద్వేలు వంటి వెనుకబడిన ప్రాంతంలో ఇలాంటి సంస్థ రావడం అభినందనీయం అని వ్యాఖ్యానించారు. ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన సెంచరీ సంస్థ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. సెంచరీ ఫ్లైబోర్డ్స్ సంస్థకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ పరిశ్రమ ప్రకాశం, నెల్లూరు జిల్లాల జామాయిల్, సుబాబుల్ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. రైతుల పంటకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని అభిప్రాయపడ్డారు. సెంచరీ ఫ్లైబోర్డ్స్ సంస్థ రాకతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని వివరించారు.

వాస్తవానికి సెంచరీ ఫ్లైబోర్డ్స్ సంస్థ తమిళనాడులో పరిశ్రమ ఏర్పాటు చేయాలని భావించింది. అయితే సీఎం జగన్ విజ్ఞప్తితో ఏపీకి తరలివచ్చినట్టు తెలుస్తోంది.

More Telugu News