Akash Chopra: వాషింగ్టన్ సుందర్ ను తీసుకోకపోవడం ఏంటి?: సెలెక్టర్లను ప్రశ్నించిన ఆకాశ్ చోప్రా

  • దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా ఎంపిక
  • సుందర్ కు దక్కని చోటు
  • గతంలో సుందర్ టీమిండియా రెగ్యులర్ ఆటగాడన్న ఆకాశ్ చోప్రా
  • జయంత్ యాదవ్ ను తీసుకోవడం సబబు కాదని వ్యాఖ్యలు
Akash Chopra questions selectors for not picking Washington Sundar

గత ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా చారిత్రక టెస్టు సిరీస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ సిరీస్ లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ తో పాటు వాషింగ్టన్ సుందర్, హనుమ విహారి మొక్కవోని పట్టుదలతో రాణించి జట్టు విజయంలో కీలకభూమిక పోషించారు. అయితే, తాజాగా దక్షిణాఫ్రికా పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో వాషింగ్టన్ సుందర్ కు స్థానం లభించలేదు. దీనిపై టీమిండియా మాజీ ఓపెనర్ క్రికెట్ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా సెలెక్టర్లను ప్రశ్నించాడు.

రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ గాయపడితే వారి స్థానాలను భర్తీ చేయకుండా, జయంత్ యాదవ్ ను ఎంపిక చేయడం ఏంటని నిలదీశాడు. జయంత్ యాదవ్ తో పోల్చితే సుందర్ బ్యాటింగ్ లోనూ ఎంతో మెరుగైన ఆటగాడని తెలిపాడు. గతంలో గాయపడిన వాషింగ్టన్ సుందర్ ఇప్పుడు ఫిట్ గా ఉన్నాడని, అతడిని సెలక్షన్ కు పరిగణనలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నాడు. దక్షిణాఫ్రికాలో పరిస్థితుల దృష్ట్యా ఆఫ్ స్పిన్నర్ గా సుందర్ కు చోటు కల్పిస్తే బాగుండేదని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.

జయంత్ యాదవ్ వయసు 31 సంవత్సరాలు కాగా, సుందర్ వయసు 22 ఏళ్లే. ఎన్నో ఏళ్ల పాటు జట్టుకు సేవలందించే సత్తా ఉన్న సుందర్ ను కాదని జయంత్ యాదవ్ ను తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.

More Telugu News