KCR: ఈరోజు ఊరూరా నిరసన కార్యక్రమాలను చేపట్టనున్న టీఆర్ఎస్!

  • ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై నిరసన
  • ఊరూరా నిరసన కార్యక్రమాలను చేపట్టాలని శ్రేణులకు కేసీఆర్ ఆదేశం
  • నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాలని ఆదేశాలు
TRS to carry statewide protest

ధాన్యం కొనుగోలు వ్యవహారం కేంద్ర ప్రభుత్వం, తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వాల మధ్య విభేదాలను పెంచుతోంది. కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనడం లేదని ఆరోపిస్తున్న టీఆర్ఎస్.. కేంద్రంపై ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమైంది. కేంద్రం తీరును నిరసిస్తూ ఊరూరా నిరసన కార్యక్రమాలను చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కేసీఆర్ ఆదేశాలతో ఈరోజు ఊరూరా కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా టీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నాయి. నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే నిరసన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాలని కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్ర రైతులకు అన్యాయం చేస్తున్న కేంద్రం తీరు ప్రజలందరికీ అర్థమయ్యేలా వివరిస్తూ, ఆందోళన కార్యక్రమాలు జరగాలని చెప్పారు. ఆయన ఆదేశాలతో ఈరోజు చావుడప్పు, ర్యాలీలతో పార్టీ శ్రేణులు నిరసన చేపట్టనున్నాయి.

More Telugu News