Allu Arjun: విలన్ కావాలనే ఇండస్ట్రీకి వచ్చాను: సునీల్

  • చాలామందిని విలన్ వేషాలు అడిగాను
  • కమెడియన్ గానే ఛాన్సులు ఇచ్చారు
  • సుకుమార్ కి నేనే కాల్ చేశాను
  • అలా ఈ వేషం వచ్చిందన్న సునీల్  
Pushpa movie update

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన 'పుష్ప' సినిమా, ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో 'మంగళం శ్రీను' అనే విలన్ పాత్రలో సునీల్ నటించాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. " తెరపై చిరంజీవిగారిని చూసిన తరువాత నాకు నటన పట్ల ఆసక్తి ఏర్పడింది. 'దేవత' సినిమాలో మోహన్ బాబును చూసిన తరువాత కామెడీ టచ్ ఉన్న విలన్ పాత్రలు చేయాలనుకున్నాను.

ఇక ఆ తరువాత ఫొటోలు పట్టుకుని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాను. అయితే ఎవరికీ కూడా నా ఫేస్ లో విలన్ కనిపించలేదనుకుంటాను. కమెడియన్ వేషాలే ఇచ్చారు .. అవే చేస్తూ వెళ్లాను. లాక్ డౌన్ సమయంలో నేను సుకుమార్ గారికి కాల్ చేశాను. కేరక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నట్టు చెప్పాను. మంచి రోల్ ఏదైనా ఉంటే ఇవ్వమని అడిగాను.

"దాదాపు చాలా కేరక్టర్స్ చేసేశావు .. సిక్స్ ప్యాక్ కూడా చూపించేశావ్. నీకు ఇస్తే ఇంతవరకూ చేయని పాత్ర ఇవ్వాలి. అలాంటి పాత్రే నీతో చేయించాలి .. చూద్దాం'' అన్నారు. ఆ తరువాత రెండు మూడు రోజులకు కాల్ చేసి, విలన్  వేషం ఇస్తున్నట్టు చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించడంతో వెంటనే ఒప్పేసుకున్నాను. ఈ పాత్ర నాకు మంచి పేరు తీసుకువస్తుందనే భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News