Tejashwi Yadav: లాలూప్రసాద్ యాదవ్ కొత్త కోడలి పేరు మార్పు!

  • తన స్నేహితురాలు రేచల్ ని పెళ్లాడిన తేజస్వి యాదవ్
  • స్వచ్ఛందంగా పేరు మార్చుకునేందుకు ముందుకొచ్చిన రేచల్
  • రేచల్ పేరు రాజ్యశ్రీగా మార్పు
Lalu Prasad daughter in law name changed

ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజస్వి యాదవ్ వివాహం ఇటీవల తన స్నేహితురాలు రేచల్ గోడిన్హోతో జరిగిన సంగతి తెలిసిందే. యాదవ సామాజికవర్గానికి చెందిన తేజస్వి క్రైస్తవ మతానికి చెందిన రేచల్ గోడిన్హోను పెళ్లాడారు. అయితే రేచల్ తన పేరును స్వచ్ఛందంగా మార్చుకునేందుకు ముందుకు వచ్చారని.. ఆమె పేరును రాజ్యశ్రీగా మార్చామని, ఈ పేరును తన తండ్రి సూచించారని చెప్పారు.

మరోవైపు తేజస్వి మతాంతర వివాహం చేసుకోవడంపై ఆయన మేనమాన సాధు యాదవ్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. లాలూ పరువు పోయేలా చేశాడని ఆయన మండిపడ్డారు. దీనిపై తేజస్వి స్పందిస్తూ ఆయన వ్యాఖ్యలను వివక్షగా చూడాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటి యువత సరికొత్త ఆలోచనాధోరణిలో ఉందని చెప్పారు.
 
తమ వివాహ వేడుకను కేవలం తను, తన భార్య కుటుంబసభ్యుల మధ్యే నిర్వహించుకోవాలని తాము నిర్ణయించుకున్నామని తేజస్వి తెలిపారు. అప్పుడే ఇరు కుటుంబాలకు చెందిన వారు ఆత్మీయంగా మాట్లాడుకోవడానికి వీలవుతుందని చెప్పారు. ప్రధాని మోదీ, ఇతర కీలక నేతలు పెళ్లికి వస్తే... వారికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని, అతిథుల సంఖ్యను తగ్గించడానికి కరోనా కూడా ఒక కారణమని అన్నారు.

More Telugu News