Terror Attack: శ్రీనగర్ లో ఉగ్రదాడి... ఇద్దరు పోలీసుల మృతి

  • కశ్మీర్ లోయలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు
  • శ్రీనగర్ శివార్లలో ఓ పోలీస్ బస్సుపై దాడి
  • క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన అధికారులు
  • దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం వేట
Terror attack  in Jammu Kashmir

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. శ్రీనగర్ శివార్లలోని జెవాన్ ప్రాంతంలో ఓ పోలీస్ బస్సుపై ఉగ్రవాదులు భారీగా కాల్పులకు తెగబడ్డారు. పోలీస్ శిబిరానికి సమీపంలోని పంతా చౌక్ వద్ద ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు తరలించారు.

ఘటనపై సమాచారం అందుకున్న సాయుధ బలగాలు వెంటనే ఆ ప్రదేశాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి.

కొన్నిరోజుల కిందట కూడా ఇదే తరహాలో ఓ పోలీస్ బస్సుపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. డిసెంబరు 10న బందిపొరా జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మరణించారు. ఇటీవల కశ్మీర్ లోయలో వలస కూలీలపై జరిగిన దాడుల తర్వాత ఉగ్రవాదులు పోలీస్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది.

More Telugu News