Nani: సిరివెన్నెల చివరిపాట పట్ల సాయిపల్లవి భావోద్వేగం!

  • నాని తాజా చిత్రంగా 'శ్యామ్ సింగ రాయ్'
  • సంగీత దర్శకుడిగా మిక్కీ జె మేయర్ 
  • హాయిని కలిగిస్తోన్న సిరివెన్నెల పాట 
  • ఈ నెల 24న సినిమా విడుదల
Shyam Singha Roy movie update

నాని హీరోగా దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ 'శ్యామ్ సింగ రాయ్' సినిమాను రూపొందించాడు. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాకి, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చాడు. కథాపరంగా ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు ఉన్నారు. ఒక కథానాయికగా సాయిపల్లవి కనిపించనుంది.

నాని .. సాయిపల్లవి కాంబినేషన్లోని ఒక పాటను కొంతసేపటి క్రితం విడుదల చేశారు. 'నెల రాజునీ .. ఇల రాణిని కలిపింది కదా సిరివెన్నెల' అంటూ చక్కని ఫీల్ తో ఈ పాట ఆకట్టుకుంటోంది. ఇది సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చివరి పాటగా చెబుతూనే చిత్ర బృందం విడుదల చేసింది. తేనెలో తీయదనం సహజంగా ఉన్నట్టే, సిరివెన్నెల సాహిత్యంలో హాయిదనం ఉంటుందని ఈ పాట మరోసారి నిరూపించింది.

ఈ పాట .. సిరివెన్నెల చివరి పాట కావడం పట్ల సాయిపల్లవి భావోద్వేగాన్ని వ్యక్తం చేసింది. "మీరు రాసిన ప్రతి పదం మీ ఆత్మను తీసుకుని వస్తోంది. మీరు ఎప్పటికీ మా హృదయాల్లో ఉంటారు" అంటూ సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ పాట ఈ సినిమాకి హైలైట్ గా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది.

More Telugu News