Telangana High Court: సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ పై తీర్పును రిజర్వ్ లో ఉంచిన తెలంగాణ హైకోర్టు

  • అక్రమాస్తుల కేసుల్లో ప్రధాన నిందితుడుగా వైఎస్ జగన్
  • వ్యక్తిగత హాజరు కోరుతూ పిటిషన్
  • తెలంగాణ హైకోర్టులో ముగిసిన వాదనలు
  • జగన్ కు మినహాయింపు ఇవ్వొద్దన్న సీబీఐ
  • సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నట్టు వ్యాఖ్య 
Telangana High Court reserves verdict on YS Jagan petition seeking personal appearance exemption

అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో నేటితో వాదనలు ముగిశాయి. అయితే న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. కాగా, ఈ పిటిషన్ పై సీబీఐ తరఫున సీనియర్ న్యాయవాది సురేంద్ర వాదనలు వినిపించారు. అక్రమాస్తుల కేసులో జగన్ కు హాజరు మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ కోర్టుకు విన్నవించింది.

గతంలో జగన్ ఇదే అభ్యర్థన చేస్తే సీబీఐ కోర్టు, హైకోర్టు నిరాకరించాయని తెలిపింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని సీబీఐ అభిప్రాయపడింది. ఈ కారణంగానే గతంలో ఆయనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు నిరాకరించినట్టు కోర్టుకు వివరించింది. ప్రస్తుతం జగన్ హోదా మరింత పెరిగిందని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నందున సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ స్పష్టం చేసింది.

పదేళ్లయినా కేసులు డిశ్చార్జి పిటిషన్ల దశలోనే ఉన్నాయని, హాజరు మినహాయింపు ఇస్తే విచారణ మరింత జాప్యం అవుతుందని వాదించింది. ఈ పిటిషన్ పై పూర్తిస్థాయిలో వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో ఉంచుతున్నట్టు ప్రకటించింది.

More Telugu News