Team India: రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసిన టీమిండియా... కివీస్ ముందు 540 పరుగుల టార్గెట్

  • ముంబయిలో భారత్ వర్సెస్ న్యూజిలాండ్
  • 276/7 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్
  • దూకుడుగా ఆడిన భారత బ్యాట్స్ మెన్
  • అక్షర్ పటేల్ మెరుపు ఇన్నింగ్స్
  • ఈసారి 4 వికెట్లు తీసిన అజాజ్ పటేల్
Team India set huge target to Kiwis in Mumbai test

ముంబయి టెస్టులో టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ ను 276/7 వద్ద డిక్లేర్ చేసింది. తద్వారా న్యూజిలాండ్ ముందు 540 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్ లో భారత బ్యాట్స్ మెన్ దూకుడు ప్రదర్శించారు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (62), ఛటేశ్వర్ పుజారా (47) తొలి వికెట్ కు 107 పరుగులు జోడించగా, వన్ డౌన్ లో వచ్చిన శుభ్ మాన్ గిల్ 47 పరుగులు నమోదు చేశాడు. కెప్టెన్ కోహ్లీ 36 పరుగులు సాధించాడు. ముఖ్యంగా, అక్షర్ పటేల్ కివీస్ బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. అక్షర్ కేవలం 26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులు బాది 41 పరుగులతో అజేయంగా నిలిచాడు.

కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ మరోసారి రాణించాడు. తొలి ఇన్నింగ్స్ లో 10కి 10 వికెట్లు పడగొట్టిన అజాజ్... రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు కైవసం చేసుకున్నాడు. తద్వారా ఈ టెస్టులో మొత్తం 14 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. రచిన్ రవీంద్ర 3 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదన ఆరంభించిన న్యూజిలాండ్ 1 ఓవర్ ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది.

More Telugu News