COVID19: ఒమిక్రాన్ రూల్స్ అమల్లోకి.. ఒక్క యాంటీజెన్​ టెస్ట్​ రూ.4 వేలు

  • చెన్నై ఎయిర్ పోర్టులో భారీగా వసూలు
  • ఢిల్లీలోనూ రూ.3,900 చార్జి
  • టెస్టుల కోసం 3 నుంచి 6 గంటల దాకా వెయిటింగ్
  • ముప్పున్న దేశాల నుంచి ఢిల్లీకి 1,013 మంది
  • మహారాష్ట్రలో ఆరుగురికి కరోనా పాజిటివ్
  • ఒమిక్రాన్ ను తేల్చేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్
  • ముప్పున్న దేశాల నుంచి వస్తే క్వారంటైన్ తప్పనిసరి చేసిన మహా సర్కార్
New Covid Rules Are In Force Covid Test Wait Time At Airport is 6 hours

ఒమిక్రాన్ కలకలం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన నూతన నిబంధనలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ముప్పున్న దేశాల నుంచి వస్తున్న వారికి విమానాశ్రయాల్లోనే కరోనా టెస్టులు చేస్తున్నారు. దీంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో టెస్టు కోసం విదేశీ ప్రయాణికులు క్యూ కట్టారు. రిస్క్ జాబితాలో లేని దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లోనూ ర్యాండమ్ గా 2 శాతం మందిని ఎంపిక చేసి టెస్టులు చేస్తున్నారు.

దీంతో ఢిల్లీ, చెన్నై విమానాశ్రయాల్లో కరోనా టెస్టుల కోసం ఆరు గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు ఉదయం నుంచి ఇప్పటిదాకా నాలుగు ముప్పున్న దేశాల నుంచి 1,013 మంది ప్రయాణికులు వచ్చారు. వారందరికీ యాంటీ జెన్, ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నారు. ప్రయాణికులకు నచ్చిన టెస్టునే చేస్తున్నారు. అయితే, తక్కువ ధర ఉన్న యాంటీ జెన్ టెస్టుకు భారీ ధరను వసూలు చేస్తున్నారు. ఒక్కో టెస్టుకు రూ.3,900 చార్జ్ చేస్తున్నారు. దాని కోసం రెండున్నర నుంచి మూడు గంటలు వేచి చూడాల్సి వస్తోంది.

అదే ఆర్టీపీసీఆర్ టెస్టు కోసం రూ.500గా చార్జీని నిర్దేశించారు. ఈ టెస్టు కోసం ఐదు నుంచి ఆరు గంటలు ప్రయాణికులు వెయిట్ చేస్తున్నారు. ముప్పున్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాల్సిందేనని మహారాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. దానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. క్వారంటైన్ లో ఉన్నప్పుడు రెండో రోజు, నాలుగో రోజు, ఏడో రోజు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని స్పష్టం చేసింది.

ముప్పున్న దేశాల నుంచి వచ్చిన ఆరుగురు ప్రయాణికులకు కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయిందని, ఒమిక్రానా? కాదా? తేల్చేందుకు జీనోమ్ టెస్టింగ్ కోసం పంపినట్టు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కాంటాక్ట్ లను ట్రేస్ చేసేందుకు చర్యలను ముమ్మరం చేస్తున్నట్టు పేర్కొంది. చెన్నై ఎయిర్ పోర్టులో దిగిన 88 మందికి టెస్టులు చేయగా.. నెగెటివ్ వచ్చింది. చెన్నైలో ఆర్టీపీసీఆర్ టెస్టుకు రూ.900, యాంటీ జెన్ టెస్టుకు రూ.4 వేల దాకా వసూలు చేస్తున్నారు. కాగా, వెయిట్ టైంను తగ్గించేందుకు ప్యాసింజర్లు ముందుగానే టెస్టును బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

More Telugu News