Chiranjeevi: సిరివెన్నెల స్థానం ఎవరూ భర్తీ చేయలేనిది: చిరంజీవి

  • నన్ను మిత్రమా అని పిలిచేవారు
  • కోలుకుంటారనే అనుకున్నాను
  • ఇలా చూస్తానని అనుకోలేదు
  • ఇది సాహిత్యానికి చీకటి రోజన్న చిరంజీవి
Chiranjeevi Memorizes Sirivennela

తెలుగు పాటకు తేనె అద్దిన రచయిత సిరివెన్నెల. తెలుగు పాట పడుచుదనాన్ని సంతరించుకుని, ఆయన కలం వెదజల్లిన వెన్నెలలోనే పరుగులు తీసింది .. ఉత్సాహంతో ఉరకలు వేసింది. తెలుగు పాటను పంచదార వంటి పదాలతో అభిషేకించిన ఆయన, కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ సాయంత్రం కన్ను మూశారు. ఆయన మృతిపట్ల అభిమానులు ..  సినీ ప్రముఖులు భారమైన మనసులతో తమ స్పందనను తెలియజేస్తున్నారు.

తాజాగా చిరంజీవి మాట్లాడుతూ, సిరివెన్నెలతో తనకి గల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సిరివెన్నెల హాస్పిటల్ కి వెళ్లే ముందు కూడా నేను మాట్లాడాను. అవసరమైతే చెన్నైలో చూపిస్తానని చెప్పాను. మరింత మెరుగైన వైద్యం అందేలా చూస్తానని అన్నాను. ఇక్కడ వైద్యం వలన ఉపశమనం కలగకపోతే, ఇద్దరం కలిసే అక్కడికి వెళదామని ఆయన అన్నారు. అలాంటి ఆయన ఇలా జీవం లేకుండా తిరిగి వస్తారని అనుకోలేదు.

ఒకే వయసువాళ్లం కావడం వలన, మిత్రమా అంటూ నన్ను ఎంతో ఆత్మీయంగా పలకరించేవారు. అలాంటి సిరివెన్నెలను ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. నేను కాల్ చేసినప్పుడు కూడా ఆయన చాలా ఉత్సాహంగా మాట్లాడితే, కోలుకుంటారనే అనుకున్నాను. తెలుగు సాహిత్యానికి ఒక చీకటి రోజును మిగిల్చి వెళ్లారు. ఆయన లేని లోటు ఎవరూ భర్తీ చేయలేనిది" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News