Harish Rao: రూ.30 లక్షల వరకు ఖర్చయ్యే బోన్ మ్యారో మార్పిడి చికిత్స ఉచితంగా అందజేస్తున్నాం: హరీశ్ రావు

  • ఖరీదైన వ్యవహారంగా బోన్ మ్యారో మార్పిడి
  • పేదలకు అందని చికిత్సగా ఉన్న ఎముక మజ్జ మార్పిడి
  • ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా అందిస్తున్నట్టు హరీశ్ వెల్లడి
  • ఒక్క తెలంగాణలోనే ఫ్రీ అంటూ వివరణ
Harish Rao says Telangana govt provides Bone Marrow Transplantation for free of cost under Arogya Sri

మానవ శరీరంలో రక్తకణాలు, ప్లేట్ లెట్ల ఉత్పత్తికి అవసరమైన మూలకణాలు ఎముక మజ్జ (బోన్ మ్యారో) నుంచే తయారవుతాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వ్యక్తుల్లో బోన్ మ్యారో మార్పిడి వల్ల సత్ఫలితాలు వస్తాయి. అయితే దీంట్లో రెండు రకాల చికిత్సలు ఉంటాయి. దీనికి రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇది ఎంతో వ్యయభరితమైన వ్యవహారం కావడంతో పేదలకు ఇది అందని చికిత్సగానే మిగిలిపోతోంది.

అయితే, తెలంగాణ ప్రభుత్వం ఎముక మజ్జ మార్పిడిని ఆరోగ్య శ్రీ పరిధిలో చేర్చింది. దీనిపై మంత్రి హరీశ్ రావు వివరణ ఇచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రభుత్వ వైద్య రంగం అద్భుత ఫలితాలు సాధిస్తోందని తెలిపారు. రూ.30 లక్షల వరకు ఖర్చయ్యే బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స ను ఆరోగ్య శ్రీ కింద నిమ్స్ లోనూ, ఎంఎన్ జే క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ ఆసుపత్రిలోనూ ఉచితంగా అందిస్తున్నారని వెల్లడించారు.

బోన్ మ్యారో మార్పిడి చికిత్సను పేదలకు ఉచితంగా అందిస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని హరీశ్ రావు ఉద్ఘాటించారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో లభించే వైద్య సౌకర్యాలు సామాన్యులకు కూడా ప్రభుత్వ వైద్య రంగంలో అందుతున్నాయని వివరించారు.

More Telugu News