Manchu Vishnu: 'మా' సభ్యుల కోసం ప్రముఖ ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకున్నాం: మంచు విష్ణు

  • సభ్యుల ఆరోగ్యంపై 'మా' కీలక నిర్ణయం
  • వివిధ ఆసుపత్రుల్లో ఉచితంగా హెల్త్ చెకప్
  • 50 శాతం రాయితీతో ఓపీ కన్సల్టేషన్
  • వచ్చే ఏడాది పలు ఆసుపత్రుల్లో హెల్త్ క్యాంపులు
Manchu Vishnu says MAA focuses on members health

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు అందుకున్న నటుడు మంచు విష్ణు తమ ప్యానెల్ అజెండాలోని అంశాల అమలుపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో హైదరాబాదులోని పలు ప్రముఖ ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు. 'మా' సభ్యులు ఎప్పటికప్పుడు ఈ ఆసుపత్రుల్లో ఉచితంగా హెల్త్ చెకప్ చేయించుకోవచ్చని తెలిపారు. 50 శాతం రాయితీతో ఓపీ కన్సల్టేషన్, ఉచిత అంబులెన్స్ సౌకర్యం సదుపాయాలు కూడా మా సభ్యులకు అందుబాటులోకి వస్తాయని వివరించారు.

అపోలో, సన్ షైన్, ఏఐజీ, కిమ్స్, మెడికవర్ ఆసుపత్రుల్లో 'మా' సభ్యులకు పై సేవలు లభిస్తాయని విష్ణు వెల్లడించారు. టెనెట్ డయాగ్నస్టిక్స్ సెంటర్ లో రాయితీపై మెడికల్ టెస్టులు చేయించుకోవచ్చన్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఏఐజీ ఆసుపత్రిలోనూ, జూన్ నెలలో అపోలో ఆసుపత్రిలోనూ, సెప్టెంబరులో కిమ్స్ లోనూ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తామని, 'మా' సభ్యులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు.

More Telugu News