Women: ఈ మాఫియా గ్యాంగ్ లో అందరూ అమ్మాయిలే!

  • లండన్ లో మహిళల మాఫియా గ్యాంగ్ అరెస్ట్
  • గ్యాంగులో ఐదుగురు అమ్మాయిలు
  • వందల కోట్ల డీల్స్
  • జైలు శిక్షలు విధించిన న్యాయమూర్తి
All women gang arrested in Brazil

హాలీవుడ్ లో కొన్నాళ్ల కిందట వచ్చిన చార్లీస్ ఏంజెల్స్ సినిమాలో ముగ్గురు అమ్మాయిలు వీరోచిత కృత్యాలు చేస్తూ మగవాళ్లతోనూ ఔరా అనిపిస్తారు. అజ్ఞాతంలో ఉండే ఓ వ్యక్తి నుంచి ఆదేశాలు అందుకుంటూ వారు పనిచేస్తారు. అయితే అది సినిమా. కానీ రియల్ లైఫ్ లో ఐదుగురు అమ్మాయిలు ఓ మాఫియా ముఠాగా ఏర్పడి డ్రగ్స్ దందా నడిపించడం తాజాగా వెలుగులోకి వచ్చింది. వారంతా బ్రెజిల్ కు చెందిన అమ్మాయిలే. వీరు కూడా ఓ వ్యక్తి తరఫున డ్రగ్స్ దందా నడిపిస్తూ  బ్రిటన్ లో ఓ ముఠాగా ఏర్పడ్డారు.

వీరి డ్రగ్స్ వ్యాపారం విలువ వందల కోట్లలో ఉంటుందని అంచనా. వీరు డ్రగ్స్ ను హృదయం ఆకారంలో ఉండే క్యాండీల తరహాలో రూపొందించి, వాటిని చాక్లెట్లు అమ్మినట్టుగా అమ్మేస్తూ కోట్లు గడిస్తున్నారు. వీరంతా ఓ డ్రగ్ కింగ్ తరఫున పనిచేస్తున్న విషయం పోలీసుల విచారణలో తేలింది. వీళ్ల బండారం బట్టబయలు కావడంతో లండన్ పోలీసులకు దొరికిపోయారు.

పలు ప్రాంతాల్లో దాడి చేసిన పోలీసులు 4 కేజీల కొకెయిన్, 2 కేజీల ఎండీఎంఏ ట్యాబ్లెట్లు, 5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.13 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. పలు ఆయుధాలు కూడా ఈ సందర్భంగా లభ్యమయ్యాయి.

కాగా, ఈ దాడుల్లో పోలీసులు ఓ కంప్యూటర్ ను స్వాధీనం చేసుకుని అందులో డేటాను పరిశీలించి ఆశ్చర్యపోయారు. చిల్లర వ్యాపారం చేస్తూ నెలకు 90 వేల పౌండ్లు సంపాదిస్తున్నట్టుగా ఆ కంప్యూటర్ లో లెక్కలు కనిపించాయి. ఈ అందమైన అమ్మాయిల కేసును విచారించిన గ్రెగరీ పెర్రిన్స్ ఏమాత్రం కనికరం చూపకుండా జైలు శిక్ష విధించాడు. వీళ్లు అమ్మాయిలే అయినా ఎంతో ప్రొఫెషనల్ గా, వ్యవస్థీకృత పంథాలో డ్రగ్స్ దందా నడిపిస్తున్నట్టు గుర్తించామని న్యాయమూర్తి పేర్కొన్నారు.

ఇక ఈ ముఠాకు వెనెస్సా అనానియస్ (29) అనే యువతి నాయకురాలు కాగా... లారిస్సీ నసిమెంటో డాస్ రీస్ (24), నయారా రోబీరో (33), ఆండ్రెస్సా శాంటోస్ (24), నయేనే ఫెర్నాండెజ్ సిల్వా (24) ఈ ముఠాలో సభ్యులు. రకరకాల తినుబండారాల పేరుతో మొత్తం 90 రకాల డ్రగ్స్ ను ఈ అమ్మాయిల గ్యాంగు విక్రయించేదని వెల్లడైంది.

వారి వాట్సాప్ చాటింగులు చూస్తే పోలీసులకు మతిపోయింది. అర కేజీ, కేజీ కాదు... ఏకంగా 10 కేజీలు, 15 కేజీల డ్రగ్స్ ను వీళ్లు స్మగ్లింగ్ చేసేవారని, ఒకసారి 50 కేజీల మాదకద్రవ్యాల డీల్ ను విజయవంతం చేశారని దర్యాప్తులో తెలిసింది. ఈ లేడీ క్రిమినల్స్ డ్రగ్స్ వ్యాపారంతో సరిపెట్టుకోకుండా, ఫేక్ ఐడీల తయారీ, ప్రజలను అక్రమంగా హెలికాప్టర్ లో సరిహద్దులు దాటించడం వంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారు.

More Telugu News