TTD: టీటీడీకి అరుదైన గుర్తింపు... వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం

  • టీటీడీ సేవలను గుర్తించిన ఇంగ్లండ్ సంస్థ
  • టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కలిసిన సంస్థ ప్రతినిధులు
  • సర్టిఫికెట్ అందజేత
  • హర్షం వ్యక్తం చేసిన వైవీ సుబ్బారెడ్డి
TTD gets recognition of World Book Of Records

ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో భక్తులు సందర్శించే పుణ్యక్షేత్రాల్లో తిరుమల ఒకటి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో తిరుమల క్షేత్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా వివిధ కార్యకలాపాలు నడుస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీకి అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచంలో మరే ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలు అందిస్తున్నందుకు గాను టీటీడీకి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించింది.

ఇంగ్లండ్ కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు నేడు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని తిరుమలలో కలిశారు. టీటీడీకి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం కల్పిస్తున్నట్టు ఓ ధ్రువీకరణ పత్రం అందజేశారు. దీనిపై వైవీ సుబ్బారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలో మరే క్షేత్రంలో లేని విధంగా భక్తులకు సేవలు అందిస్తున్నామని, మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నామని, తమ పనితీరుకు విశిష్ట గుర్తింపు లభించిందని సంతోషం వెలిబుచ్చారు.

సాధారణ రోజుల్లో రోజుకు 60 వేల నుంచి 70 వేల మంది భక్తలకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా శ్రీవారి దర్శనం చేయిస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శాస్త్రీయ విధానంలో క్యూలైన్ల నిర్వహణ చేపడుతున్నామని, రోజుకు 3.5 లక్షల లడ్డూలను ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణంలో తయారుచేస్తున్నామని పేర్కొన్నారు.

More Telugu News