Delhi: ఢిల్లీలో ప్రమాదకరస్థాయిలో కాలుష్యం... కీలక నిర్ణయాలు తీసుకున్న కేజ్రీవాల్ ప్రభుత్వం

  • ఢిల్లీలో కాలుష్య బీభత్సం
  • పాఠశాలలు వారం పాటు మూసివేత
  • ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్
  • లాక్ డౌన్ అంశాన్ని పరిశీలిస్తున్నామన్న సీఎం కేజ్రీవాల్
Delhi govt reviews pollution situation

దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్నాళ్లుగా వాతావరణ కాలుష్యం ఏమాత్రం అదుపులోకి రావడంలేదు. ఇటీవల కొన్నిరోజులుగా కాలుష్య స్థాయి ప్రమాదకరస్థాయికి చేరడంతో సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో సాధారణ జనజీవనం సాధ్యం కాని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

పాఠశాలలకు వారం రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ నెల 15 నుంచి వారం రోజుల పాటు ఆన్ లైన్ లో తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. అటు ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేయాలని పేర్కొంది. ప్రైవేటు సంస్థల ఉద్యోగులకు కూడా ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించాలని యాజమాన్యాలకు సూచించింది. అంతేకాదు, ఈ నెల 14 నుంచి 17 వరకు భవన నిర్మాణ పనులు నిలిపివేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలో కాలుష్య తీవ్రతపై నేడు సమీక్ష జరిపారు. లాక్ డౌన్ విధించాలన్న సీజేఐ ఎన్వీ రమణ సూచనను పరిశీలిస్తున్నామని కేజ్రీవాల్ తెలిపారు. కేంద్రంతో చర్చించి లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

More Telugu News