New Zealand: టీ20 వరల్డ్ కప్: డారిల్ మిచెల్ ధనాధన్ ఇన్నింగ్స్.... ఫైనల్లోకి దూసుకెళ్లిన న్యూజిలాండ్

  • న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య సెమీస్ సమరం
  • రసవత్తర పోరులో కివీస్ ఘనవిజయం
  • 47 బంతుల్లో 72 పరుగులు చేసిన డారిల్ మిచెల్
  • మెరుపు ఇన్నింగ్స్ ఆడిన జేమ్స్ నీషామ్
  • నేడు రెండో సెమీస్ లో పాక్ వర్సెస్ ఆస్ట్రేలియా
New Zealand storms into world cup final

టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ ఫైనల్లో ప్రవేశించింది. కివీస్ ఓపెనర్ డారిల్ మిచెల్ భారీ షాట్లతో విరుచుకుపడి ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లాడు. అత్యంత ఆసక్తికరంగా సాగిన సెమీఫైనల్లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ను ఓడించింది. ఇంగ్లండ్ విసిరిన 167 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలుండగానే ఛేదించింది. డారిల్ మిచెల్ 47 బంతుల్లోనే 72 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మిచెల్ స్కోరులో 4 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 166 పరుగులు చేసింది. మొయిన్ అలీ (51), డేవిడ్ మలాన్ (41) రాణించారు.

అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 13 పరుగులకే ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (4), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (5) ల వికెట్లు కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ డారిల్ మిచెల్ మాత్రం ఇంగ్లండ్ బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి పంపిస్తూ స్కోరుబోర్డును ముందుకు ఉరికించాడు. ఈ క్రమంలో అతడికి వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ డెవాన్ కాన్వే (38 బంతుల్లో 46), జిమ్మీ నీషామ్ (11 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్సులు)ల నుంచి విశేషమైన సహకారం లభించింది.

చివరి 5 ఓవర్లలో మిచెల్, నీషామ్ సిక్సర్ల మోత మోగించడంతో కివీస్ విజయం ఖాయమైంది. ఇక నేడు జరిగే రెండో సెమీఫైనల్లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి.

More Telugu News