Viral Videos: జ‌ల‌పాతం వ‌ద్ద నీటి ప్ర‌వాహంలో చిక్కుకున్న‌ కాబోయే దంపతులు.. వీడియో వైర‌ల్

  • రాజ‌స్థాన్‌లో ఘ‌ట‌న‌
  • ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెళ్లిన జంట‌
  • నీటి ప్ర‌వాహం మ‌ధ్య కొన్ని గంట‌లు
  • కాపాడిన రెస్క్యూ టీమ్
couple stuck at waterfalls

ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం జ‌ల‌పాతం వ‌ద్ద‌కు వెళ్లిన ఓ జంట త‌మ వెంట వ‌చ్చిన మ‌రో ఇద్ద‌రితో క‌లిసి అందులోనే ఇరుక్కుపోయారు. వారి చుట్టూ ఒక్క‌సారిగా పెద్ద ఎత్తున నీటి ప్ర‌వాహం పెరిగిపోవ‌డంతో కొన్ని గంట‌ల పాటు నీటి మ‌ధ్య‌ బండ రాయి మీదే బిక్కుబిక్కుమంటూ కూర్చొని ఉండిపోయారు.

ఈ ఘ‌ట‌న రాజస్థాన్ లోని  రావత్‌భటా జిల్లాలోని చులియా జలపాతం వద్ద చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. వారు నీటి మ‌ధ్య చిక్కుకుపోయిన విష‌యం ఫొటోగ్రాఫ‌ర్ అందించిన స‌మాచారం ద్వారా తెలుసుకున్న అధికారులు రెస్క్యూ సిబ్బందితో అక్క‌డ‌కు చేరుకుని వారిని ర‌క్షించి తీసుకెళ్లారు.

రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్‌లోని నాలుగు గేట్లను తెరిచి నీటిని వదలడంతో వ‌ధూవ‌రులు అందులో చిక్కుకున్నార‌ని వివ‌రించారు. ఈ యువతీయువ‌కుల‌ వివాహం వ‌చ్చేనెల‌ 1న జరగనుంది. వ‌ధూవ‌రుల పేర్లు ఆశిష్ గుప్తా, శిఖా అని అధికారులు వివ‌రించారు. వారిద్ద‌రు మ‌రో ఇద్ద‌రితో క‌లిసి జ‌ల‌పాతం వ‌ద్ద‌కు వ‌చ్చి ఫొటోలు తీసుకుంటుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని చెప్పారు.

కాగా, నీటి ప్ర‌వాహం పెరిగిన స‌మ‌యంలోనే ఫొటోగ్రాఫ‌ర్ వ‌ధూవ‌రుల‌ను అప్ర‌మ‌త్తం చేసి బ‌య‌ట‌కు రావాల‌ని చెప్పిన‌ప్ప‌టికీ ఆ యువ‌తీయువకులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించి అక్క‌డే ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్రీ వెడ్డింగ్ షూట్ స‌మ‌యంలో గ‌తంలోనూ కొన్ని జంట‌ల‌కు ఇటువంటి అనుభ‌వ‌మే ఎదురైంది.


                

More Telugu News