Uttar Pradesh: లఖింపూర్ ఖేరి ఘటనలో మరో ట్విస్ట్.. మంత్రి కుమారుడి తుపాకీ నుంచి కాల్పులు వాస్తవమేనంటున్న ఫోరెన్సిక్ రిపోర్ట్!

  • ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వెల్లడి  
  • ఆశిష్ మిశ్రా, అనుచరుడి తుపాకుల నుంచి కాల్పులు
  • ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న ఆశిష్
Forensic Laboratory Confirms That Ashish Mishra Fired Rounds

లఖింపూర్ ఖేరి ఘటనలో మరో షాకింగ్ విషయం వెల్లడైంది. అక్టోబర్ 3న రైతులపైకి మంత్రి కుమారుడి కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు చనిపోవడం.. ఆ తర్వాత రైతులు కర్రలతో దాడి చేయడం వల్ల మరో నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు అంకిత్ దాస్ కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు.

అయితే, ఘటన సమయంలో ఆశిష్ మిశ్రా, ఆయన అనుచరులు కాల్పులు జరిపారని రైతులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆశిష్, అంకిత్ ల లైసెన్స్డ్ గన్నులను అక్టోబర్ 15న ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపించారు. వాటిని పరీక్షించిన ఫోరెన్సిక్ లేబొరేటరీ.. ఆ తుపాకుల నుంచి కాల్పులు జరిగినట్టు ధ్రువీకరించింది. కాగా, లఖింపూర్ కేసుకు సంబంధించి మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసును సుప్రీంకోర్టు విచారిస్తోంది.

More Telugu News