Sri Nagar: శ్రీనగర్ ఆసుపత్రిలో ఉగ్రవాదుల కాల్పులు.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతాబలగాలు

  • కాల్పుల్లో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు
  • జనాల మధ్య నుంచి తప్పించుకున్న ఉగ్రవాదులు
  • ముష్కరుల కోసం శ్రీనగర్ ను జల్లెడ పడుతున్న భద్రతాబలగాలు
Terrorists fires in Sri Nagar hospital

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్ లోని ఒక ఆసుపత్రిపై వారు దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే, ఈ ఘటన నుంచి ఉగ్రవాదులు సురక్షితంగా తప్పించుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న జనాల మధ్య నుంచి వారు ఆ ప్రాంతం నుంచి బయటపడ్డారు.

ఈ ఘటనపై శ్రీనగర్ పోలీసులు స్పందిస్తూ... టెర్రరిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయని తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న జనాల మధ్య నుంచి ఉగ్రవాదులు తప్పించుకుని వెళ్లిపోయారని వెల్లడించారు. ఎన్డీటీవీ కథనం ప్రకారం ఒక వ్యక్తి ఈ కాల్పుల్లో గాయపడ్డాడు. అతనికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.

మరోవైపు ఈ ఘటన జరిగిన వెంటనే ఆసుపత్రిని, దానికి సంబంధించిన మెడికల్ కాలేజీని భద్రతాబలగాలు చుట్టుముట్టాయి. వలస కూలీలపై టెర్రరిస్టులు ఇటీవల దాడి చేసిన తర్వాత టెర్రరిస్టులు బరితెగించడం ఇదే తొలిసారి. ఆ దాడి జరిగిన తర్వాత మరో 50 కంపెనీల సెక్యూరిటీని శ్రీనగర్ లో మోహరింపజేశారు. అయినా, ఈరోజు దాడి జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో శ్రీనగర్ ను భద్రతాబలగాలు జల్లెడ పడుతున్నాయి. ముష్కరుల కోసం వేట కొనసాగిస్తున్నాయి.

More Telugu News