Tollywood: విజయ్ సేతుపతిపై దాడి వెనుక కారణం ఇదట.. ఆ వ్యక్తి వివరాలూ వెల్లడి!

  • సెల్ఫీ తీసుకోకుండా తోసేసిన సేతుపతి బాడీ గార్డులు
  • ఆ ఆవేశంతోనే తన్నిన జాన్సన్
  • అప్పటికే తాగిన మత్తులో ఉన్న వ్యక్తి
This Is The Reason Behind Attack On Vijay Sethupathi

రెండు రోజుల క్రితం బెంగళూరు విమానాశ్రయం నుంచి బయటకు వస్తుండగా.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని ఓ వ్యక్తి ఎగిరి తన్నిన సంగతి తెలిసిందే. ఆ ఘటన ఎంత సంచలనం సృష్టించిందో కూడా తెలిసిందే. ఆ వీడియో వైరల్ గానూ మారింది. అసలు అతగాడు.. విజయ్ సేతుపతిని ఎందుకు తన్నాడు? వ్యక్తిగత కక్షలేమైనా ఉన్నాయా? అన్న అనుమానాలు చాలామందిలో కలిగాయి.

ఈ నేపథ్యంలో దాడికి గల కారణాలు బయటకు వచ్చాయి. దాడి చేసిన వ్యక్తి వివరాలూ తెలిశాయి. ఆ వ్యక్తి పేరు జాన్సన్. కేరళకు చెందిన అతడు.. ఉద్యోగం నిమిత్తం బెంగళూరులో ఉంటున్నట్టు తెలుస్తోంది. విమానాశ్రయం నుంచి వెళ్తున్న క్రమంలో విజయ్ సేతుపతిని సెల్ఫీ అడిగాడట అతడు. అందుకు నిరాకరించిన సేతుపతి వ్యక్తిగత అంగరక్షకులు.. జాన్సన్ ను పక్కకు తోసేశారట.

అప్పటికే తాగిన మత్తులో ఉన్న ఆ వ్యక్తి.. సేతుపతి బాడీగార్డులు చేసిన పనికి ఆవేశంతో రగిలిపోయాడట. ఆ క్రమంలోనే పరుగెత్తుకుంటూ వచ్చి ఎగిరి తన్నాడట. ఈ చర్యతో బిత్తరపోయిన బాడీగార్డులు వెంటనే అతడిని పట్టుకున్నారు. విజయ్ సేతుపతి మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, జరిగిన ఘటనపై సదరు వ్యక్తి.. సేతుపతికి క్షమాపణలు చెప్పినట్టు తెలుస్తోంది.

More Telugu News