Puneet Rajkumar: పునీత్ రాజ్ కుమార్ కళ్లతో నలుగురికి నేత్రదానం

  • బ్రతికుండగానే నేత్రదానం చేసిన పునీత్ రాజ్ కుమార్
  • నలుగురికి చూపును తెప్పించిన నారాయణ నేత్రాలయ
  • కార్నియాలోని సుపీరియర్, డీపర్ లేయర్స్ ని వేరు చేయడం ద్వారా నలుగురికి చూపు
four blind persons got sight with Puneet Rajkumar

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణం అందరినీ కలచివేసింది. ఇప్పటికీ ఆయన మరణం తాలూకు విషాదం నుంచి ఎవరూ కోలుకోలేదు. రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరోగా కూడా ఆయన అందరి మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. తాను బతికి ఉన్నంత కాలం ఆయన వందలాది మంది విద్యార్థులకు అండగా నిలిచారు. ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారు.

ఇక మరణం తర్వాత కూడా నలుగురి జీవితాల్లో వెలుగు నింపారు. పునీత్ కళ్లతో నలుగురికి చూపు దక్కింది. ఈ విషయాన్ని నారాయణ నేత్రాలయ ఛైర్మన్, ఎండీ భుజంగ్ శెట్టి వెల్లడించారు. సాధారణంగా ఒక వ్యక్తి దానం చేసిన కళ్లతో ఇద్దరికి మాత్రమే చూపు దక్కుతుందని... అయితే పునీత్ కళ్లతో నలుగురికి చూపును ప్రసాదించామని చెప్పారు.

పునీత్ కళ్లలోని కార్నియాలోని సుపీరియర్, డీపర్ లేయర్స్ ని వేరు చేయడం ద్వారా... వాటిని నలుగురికి అమర్చగలిగామని తెలిపారు. ఒక్కో కంటిని ఇద్దరికి చూపును తెప్పించేందుకు వినియోగించామని చెప్పారు. సూపర్ఫీషియల్ కార్నియల్ వ్యాధి ఉన్నవారికి సుపీరియర్ లేయర్ మార్పిడి చేశామని.. డీప్ కార్నియల్ లేయర్ వ్యాధి / ఎండోథెలియల్ వ్యాధి ఉన్నవారికి డీపర్ లేయర్ ట్రాన్స్ ప్లాంట్ చేశామని తెలిపారు. ఈ విధంగా పునీత్ కళ్లతో నలుగురికి చూపును తెప్పించామని చెప్పారు.

More Telugu News