Leander Paes: గోవా ఎన్నికల వేళ.. టీఎంసీ తీర్థం పుచ్చుకున్న టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్

  • బాలీవుడ్ నటి నసీఫా అలీ, హక్కుల కార్యకర్త మృణాళిని దేశ్‌ప్రభు కూడా..
  • ప్రజాసేవకు పునరంకితమవుతానన్న పేస్
  • మమతను నిజమైన చాంపియన్‌గా అభివర్ణించిన పేస్
Leander Paes and Actor Nafisa Ali Joined Trinamool Congress

భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. టెన్సిస్‌కు గుడ్‌బై చెబుతున్నట్టు శుక్రవారం ప్రకటించిన పేస్.. ఇకపై తాను రాజకీయ వేదికగా ప్రజాసేవలో తరించాలనుకుంటున్నట్టు తెలిపాడు. తృణమూల్ కాంగ్రెస్ సారథి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. గోవా అసెంబ్లీ ఎన్నికల వేళ పేస్ చేరిక ప్రాధాన్యం సంతరించుకుంది.

టీఎంసీలో చేరిన మూడో సెలబ్రిటీ లియాండర్ పేస్. బాలీవుడ్ నటి నఫీసా అలీ, కార్యకర్త మృణాళిని దేశ్‌ప్రభు కూడా  నిన్ననే తృణమూల్‌లో చేరారు. పేస్‌ను మమత సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లియాండర్ పేస్ మాట్లాడుతూ.. టెన్నిస్ నుంచి తాను రిటైర్ అయ్యానని, ఇకపై రాజకీయ వేదికగా ప్రజా సేవకు అంకితమవుతానని పేర్కొన్నాడు. మమతను నిజమైన చాంపియన్‌గా 48 ఏళ్ల పేస్ అభవర్ణించారు.
 
గోవాలో పాగా వేయాలని చూస్తున్న మమత బెనర్జీ  అధికార బీజేపీని ఎదురొడ్డేందుకు పావులు కదుపుతున్నారు. త్వరలోనే గోవా వెళ్లనున్న మమత మేధావులు, ఆలోచనాపరులు, నిపుణులు, ఇతరులతో భేటీ కానున్నట్టు పార్టీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. 40 స్థానాలున్న గోవా అసెంబ్లీలో 17 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ అధికారంలో ఉంది. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ), ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతుతో రాష్ట్రాన్ని పాలిస్తోంది. కాగా, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, కేజ్రీవాల్ గోవాపై దృష్టి సారించారు.

More Telugu News