Vijayashanti: దళితులను బూతులు తిట్టి, కొట్టిన హరీశ్ రావుకు బాధ్యతలను అప్పగించడం సిగ్గుచేటు: విజయశాంతి

  • దళితుల పట్ల హరీశ్ కు గౌరవం లేదు
  • దళితబంధు గురించి ఆయన మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది
  • హరీశ్ ను పార్టీ నుంచి కేసీఆర్ వెళ్లగొడతారు
Harish Rao is anti Dalit says Vijayashanti

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావులపై బీజేపీ నాయకురాలు విజయశాంతి నిప్పులు చెరిగారు. దళితుల పట్ల ఏమాత్రం గౌరవం లేని హరీశ్ రావుకు హుజూరాబాద్ ఎన్నికల బాధ్యతను కేసీఆర్ అప్పగించడం సిగ్గుచేటని విమర్శించారు. ఢిల్లీలో దళిత ఉద్యోగులను అత్యంత దారుణంగా హరీశ్ రావు బూతులు తిట్టారని, చేయి కూడా చేసుకున్నారని ఆమె అన్నారు. కేసీఆర్ దళిత ద్రోహి అయితే... హరీశ్ రావు దళిత ద్వేషి అని దుయ్యబట్టారు. వీరిద్దరికీ హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టాల్సిన సమయం ఆసన్నమయిందని అన్నారు.

హరీశ్ రావు దళితబంధు గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని విజయశాంతి విమర్శించారు. దళితుల పట్ల అగౌరవంగా ప్రవర్తించిన హరీశ్ రావు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని అన్నారు. హరీశ్ ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని కథలు పడినా... కేటీఆర్ ను కేసీఆర్ సీఎం చేస్తారని, హరీశ్ రావును పార్టీ నుంచి వెళ్లగొడతారని చెప్పారు.

More Telugu News