YS Sharmila: మళ్లీ మళ్లీ చెబుతున్నా.. తెలంగాణలో కేసీఆర్ పాలన పోవాలి: షర్మిల

  • టీఆర్ఎస్, బీజేపీ ఒకదాని కోసం మరోటి పనిచేస్తున్నాయి
  • మతతత్వ బీజేపీతో, ప్యాకేజీల కోసం అమ్ముడుపోయే కాంగ్రెస్‌తో మాకు పొత్తులేదు
  • దేశంలో ధరల పెరుగుదలకు మోదీ, కేసీఆర్ కారణం
YS Sharmila Said we dont have any alliance with bjp or congress

తెలంగాణలో కేసీఆర్ పాలన అంతం కావాల్సిందేనని, ఈ విషయాన్ని తాను మళ్లీ మళ్లీ చెబుతున్నానని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. చేవెళ్ల నుంచి ఆమె ప్రారంభించిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర నిన్న ఐదో రోజు మహేశ్వరం మండలంలో కొనసాగింది. శనివారం నాగారంలో బసచేసిన షర్మిల నిన్న ఉదయం పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం ఉదయం 10 గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది. నాగారం, పెద్దతండా, డబిల్‌గూడ, మన్‌సాన్‌పల్లి, కేసీతండా మీదుగా పాదయాత్ర మహేశ్వరానికి చేరుకుంది.

మహేశ్వరంలో ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. టీఆర్ఎస్, బీజేపీలు ఒకదాని కోసం మరొకటి పనిచేస్తున్నాయని విమర్శించారు. తమకు మతతత్వ బీజేపీతోకానీ, ప్యాకేజీల కోసం అమ్ముడుపోయే కాంగ్రెస్‌తో కానీ పొత్తులేదని, టీఆర్ఎస్‌తో  మైత్రి లేదని అన్నారు. సింహం సింగిల్‌గానే వస్తుందన్నారు.

దేశంలో పెట్రోలు నుంచి వంట గ్యాస్ ధరల వరకు పెరగడానికి మోదీ, కేసీఆర్‌లే కారణమన్నారు. వైఎస్సార్ సంక్షేమ పాలన అంటే ఉచిత విద్య, వైద్యం నిరుపేదలకు సొంతిల్లు, వ్యవసాయం పండుగ, నిర్యోగులకు ఉద్యోగాలు, అప్పులు లేకుండా జీవించడమని షర్మిల అన్నారు. నిన్న రెండు  కిలోమీటర్లు నడిచిన షర్మిల సాయంత్రం తుమ్మలూరులో ఏర్పాటు చేసిన శిబిరంలో బసచేశారు.

More Telugu News