Matchbox: 14 ఏళ్ల తర్వాత తొలిసారి పెరుగుతున్న అగ్గిపెట్టె ధరలు.. ఇక పెట్టె 2 రూపాయలు!

  • 2007లో తొలిసారి రూ. 50 పైసల పెంపు
  • 14 రకాల ముడి పదార్థాల ధరలు పెరగడమే కారణం
  • డిసెంబరు 1 నుంచి కొత్త ధర అమలు
Matchboxes to cost Rs 2 from Dec 1

దాదాపు 14 సంవత్సరాల తర్వాత తొలిసారి అగ్గిపెట్టె ధరలు పెరుగుతున్నాయి. అగ్గిపుల్లల తయారీలో ఉపయోగించే 14 రకాల ముడి పదార్థాల ధరలు పెరగడమే ఇందుకు కారణం. ప్రస్తుతం అగ్గిపెట్టెను రూపాయికి విక్రయిస్తుండగా డిసెంబరు 1 నుంచి రెండు రూపాయలకు విక్రయించనున్నట్టు తయారీ సంస్థలు ప్రకటించాయి. అగ్గిపుల్ల తయారీలో వినియోగించే రెడ్‌ఫాస్ఫరస్, మైనం, బాక్స్ బోర్డులు, పేపర్, పొటాషియం క్లోరేట్, గంధకం వంటి వాటి ధరలు పెరగడంతో అగ్గిపెట్ట ధర పెంచక తప్పడం లేదని తయారీదారులు పేర్కొన్నారు.

అగ్గిపెట్టె తయారీదార్లకు సంబంధించి 5 సంఘాలు శివకాశీలో సమావేశమై ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నాయి.  కాగా, చివరిసారి 2007లో అగ్గిపెట్టె ధరను పెంచారు. అప్పట్లో రూ. 50 పైసలు ఉన్న అగ్గిపెట్టె ధరను రూపాయికి పెంచారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆ ధరను రెట్టింపు చేశారు. ప్రస్తుతం 600 అగ్గిపెట్టెలు ఉన్న బాక్స్‌ను రూ. 270-300 మధ్య విక్రయిస్తుండగా, తాజా నిర్ణయంతో దీని ధర రూ. 430-480కి పెరగనుంది. ఈ మేరకు నేషనల్ స్మాల్ మ్యాచ్‌బాక్స్ మాన్యుఫ్యాక్చర్స్ అసోసియేషన్ కార్యదర్శి వి.ఎస్. సేతురథినమ్ తెలిపారు. ఈ ధరకు 12 శాతం జీఎస్టీ, రవాణా చార్జీలు అదనమని తెలిపారు.

More Telugu News