Naresh: ప్రశ్నించేవారు ఏం ప్రశ్నిస్తారో చూస్తాం!: ప్రకాశ్ రాజ్ ప్యానల్ పై ఘాటుగా స్పందించిన నరేశ్

  • విష్ణు 'మా' అధ్యక్ష బాధ్యతలను చేపట్టడం సంతోషంగా ఉంది
  • ఎన్నికల తర్వాత కూడా విమర్శలు చేస్తున్నారు
  • అతిగా ఏడ్చేవారిని నమ్మరాదన్న నరేశ్  
Naresh sensational comments on Prakash Raj panel

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలను చేట్టారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు నరేశ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ, విష్ణు అధ్యక్ష బాధ్యతలను చేపట్టడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. 'మా' అనేది ఒక సేవా సంస్థ అని అన్నారు.

ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా విమర్శలు చేస్తున్నారంటూ ప్రకాశ్ రాజ్ ప్యానల్ పై మండిపడ్డారు. అతిగా ఏడ్చే వారిని నమ్మరాదని అన్నారు. ప్రశ్నించేవారు ఏం ప్రశ్నిస్తారో చూస్తామని చెప్పారు.

తాము ప్రశ్నించేతత్వం ఉన్న వాళ్లమని... ప్రశ్నిస్తే స్వీకరించే తత్వం వారికి లేదని... ఈ క్రమంలో గొడవలు జరుగుతాయని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. గొడవల వల్ల సంక్షేమం, అభివృద్ధి ఆగిపోతాయని చెప్పారు. తాము రాజీనామా చేసినా బయట నుంచి ప్రశ్నిస్తుంటామని అన్నారు. ఈ నేపథ్యంలోనే నరేశ్ ఘాటుగా స్పందించారు.

More Telugu News