Manchu Vishnu: ప్రకాశ్ రాజ్ వేరే భాషకు చెందిన వ్యక్తి అని, ఓటేయొద్దని నేను ఎప్పుడూ చెప్పలేదు: మంచు విష్ణు

  • ప్రకాశ్ రాజ్ అనేక భాషలకు చెందిన నటుడని వ్యాఖ్య  
  • ఏ భాషను నమ్ముకుంటారో అందులోనే పోరాడాలని సూచన
  • తాను తెలుగు భాషనే నమ్ముకున్నానని విష్ణు స్పష్టీకరణ
  • శివాజీ గణేశన్ తనయుడు ప్రభుకు 'మా'లో సభ్యత్వం ఉందని వెల్లడి 
Manchu Vishnu clarifies on his comments

మీడియా సమావేశంలో మంచు విష్ణు పలు అంశాలపై వివరణ ఇచ్చారు. తెలుగువాడే 'మా' అధ్యక్షుడు అవ్వాలని తానెప్పుడూ అనలేదని స్పష్టం చేశారు. తెలుగు కళామతల్లిని నమ్ముకున్నవాడే మా అధ్యక్షుడు అవ్వాలని, అప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుందని చెప్పానని ఉద్ఘాటించారు.

"ప్రకాశ్ రాజ్ కి ఇవాళ కూడా చెబుతాను. ఆయన ఒక్క తెలుగు నటుడే కాదు, కన్నడలో నటిస్తారు, తమిళంలో నటిస్తారు, హిందీలో కూడా చేయొచ్చు. అయితే ఆయన ఏ భాషను నమ్ముకున్నాడో ఆ భాష చిత్ర పరిశ్రమలో ఆయన పోరాడాలి. ఆయన అన్ని భాషల్ని నమ్ముకున్నాడు. కానీ నేను నమ్ముకుంది ఒక్క తెలుగు భాషనే. తెలుగు కళామతల్లినే నేను నమ్ముకున్నాను. అదే చెప్పాను. అంతే తప్ప, ఆయన వేరే ఊరి నుంచి వచ్చాడు, ఆయనకు ఓటేయొద్దని ఎప్పుడూ చెప్పలేదు.

ఇది మా భాష అని, మా తెలుగు కళామతల్లి అని నమ్మే ప్రతి ఒక్కరూ ఇక్కడ పోటీ చేయొచ్చు. తమిళ నట దిగ్గజం శివాజీ గణేశన్ తనయుడు ప్రభుకు 'మా'లో సభ్యత్వం ఉంది. రేపు ఆఫ్ఘనిస్థాన్ నుంచి, శ్రీలంక నుంచి కూడా తెలుగు సినిమాల్లో నటించేవాళ్లు రావొచ్చు. వారందరికీ 'మా'లో సభ్యత్వం ఉంటుంది" అని మంచు విష్ణు వివరణ ఇచ్చారు.

More Telugu News