YS Sharmila: బీజేపీ ఎంపీ అర్వింద్ ను టార్గెట్ చేసిన షర్మిల

  • డిచ్ పల్లిలో షర్మిల నిరుద్యోగ దీక్ష
  • సాలూరు ప్రాజెక్టును సాధ్యం చేసి చూపించింది వైఎస్సార్
  • అర్వింద్ పసుపు రైతులను వంచించాడని ఆరోపణ
  • బాండ్ పేపర్ ఏమైందని నిలదీసిన షర్మిల
YS Sharmila targets BJP MP Arvind

వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ను లక్ష్యంగా చేసుకున్నారు. డిచ్ పల్లిలో నిరుద్యోగ దీక్ష ముగిసిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పసుపు బోర్డుపై ఎంపీ అర్వింద్ ప్రజలను వంచించాడని విమర్శించారు. పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన ఎంపీ అర్వింద్ తన హామీపై ఇప్పటివరకు చేసిందేమిటి? అని ప్రశ్నించారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులను మోసం చేసిందని అన్నారు.

బోధన్ ప్రజల 30 ఏళ్ల కల సాలూరు ప్రాజెక్టును సాధ్యం చేసి చూపించింది వైఎస్సార్ అని షర్మిల పేర్కొన్నారు. నిజామాబాద్ లో అనేక పరిశ్రమలతో పాటు పసుపు పార్క్ ను కూడా ఏర్పాటు చేసేందుకు నాటి యూపీఏ సర్కారును కూడా ఒప్పించారని తెలిపారు. దురదృష్టవశాత్తు వైఎస్సార్ నేడు లేరని, కానీ, ఇవాళ పసుపు రైతులను పట్టించుకునే నాథుడే లేడని విమర్శించారు.

మాటలు చెబితే నమ్మరని బాండ్ పేపర్ రాసిచ్చిన అర్వింద్... తాటాకు అడిగితే ఈతాకు ఇచ్చాడని విమర్శించారు. అధికార పక్షం, విపక్షం... అన్న తేడా లేకుండా అందరూ రైతులను మోసం చేసేవారేనని ఆరోపించారు.

More Telugu News