Delhi Capital: స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లో ఓడిన చెన్నై.. టాప్ ప్లేస్‌లో ఢిల్లీ

  • 13 మ్యాచుల్లో 10 విజయాలతో అగ్రస్థానంలో ఢిల్లీ
  • లక్ష్య ఛేదనలో తడబడిన ఢిల్లీ
  • ఫోర్ కొట్టి విజయాన్ని అందించిన రబడ
Delhi tops in points table

చెన్నైతో ఉత్కంఠగా సాగిన స్కోరింగ్ మ్యాచ్‌లో విజయం సాధించిన ఢిల్లీ కేపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు 13 మ్యాచుల్లో తలపడిన ఢిల్లీకి ఇది పదో విజయం కాగా, చెన్నైకి ఇది నాలుగో ఓటమి.

దుబాయ్‌ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో గత రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టులో రాయుడు మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. 43 బంతులు ఎదుర్కొన్న రాయుడు 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేయడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో అక్సర్ పటేల్ 2, నార్జే, అవేశ్ ఖాన్, అశ్విన్ చెరో వికెట్ తీసుకున్నారు.

అనంతరం 137 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ తడబడడంతో మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగింది. చివరికి మరో రెండు బంతులు మిగిలి ఉండగా ఏడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. శిఖర్ ధావన్ 39, షిమ్రన్ హెట్మెయిర్ 28 (నాటౌట్), పృథ్వీషా 18, రిపల్ పటేల్ 18, రిషభ్ పంత్ 15 పరుగులు చేశారు.

చివరి నాలుగు బంతుల్లో విజయానికి రెండు పరుగులు అవసరమైన వేళ అక్సర్ పటేల్ (5) అవుట్ కావడంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కగిసో రబడ తాను ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి తరలించి జట్టుకు విజయాన్ని అందించాడు.

చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, దీపక్ చాహర్, హేజిల్‌వుడ్, బ్రావో చెరో వికెట్ తీసుకున్నారు. అక్సర్ పటేల్‌కి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఐపీఎల్‌లో నేటి రాత్రి ఏడున్నర గంటలకు రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.

More Telugu News