Bengaluru: పుల్ల ఐస్ కాదిది.. పుల్ల ఇడ్లీ.. వైరల్ అయిపోతున్న వెరైటీ ఇడ్లీ!

  • బెంగళూరు హోటల్ నిర్వాహకుల వినూత్న ఆలోచన
  • ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్ర
  • ఆవిష్కరణల రాజధాని నుంచి మరో ఆవిష్కరణ అంటూ ట్వీట్
Stick Idly From Bangalore Gets Viral

ఫొటో చూడగానే ఐస్ క్రీమ్ ను చట్నీలో, సాంబార్ లో ముంచుకు తింటారా? అనే డౌట్ వచ్చేసింది కదూ. కానీ, ఇది పుల్ల ఐస్ ఏ మాత్రం కాదు. మనం సాంబార్ ఇడ్లీ, ఘీ ఇడ్లీ, బటర్ ఇడ్లీ.. వంటి వెరైటీలు వినే ఉంటాం.. తినే ఉంటాం. ఇది పుల్ల ఇడ్లీ. అవును అచ్చంగా అది ఇడ్లీనే. ఐస్ క్రీంను తలపించే పుల్ల ఇడ్లీనే. దేశ ఐటీ రాజధాని అయిన బెంగళూరులోని ఓ హోటల్ లో ఇలా కొత్తగా ఇడ్లీకి మేకప్ టచ్ ఇచ్చారన్నమాట.


ఆ ఫొటో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర కంట పడింది. ఇలాంటి కొత్త ఆలోచనలు కనిపిస్తే ఆయన ఊరుకుంటారా చెప్పండి! వెంటనే ట్విట్టర్ లో ఆ ఫొటో పెట్టేశారు. ‘‘భారత ఆవిష్కరణల రాజధాని అయిన బెంగళూరు.. సృజనాత్మకతలో ఎక్కడా ఆగట్లేదు. అసలు ఊహించని దారుల్లో ఊహించని కొత్త ఆవిష్కరణలు వచ్చేస్తున్నాయి. ఇదిగో ఈ పుల్ల ఇడ్లీనే ఉదాహరణ. సాంబార్, చట్నీలో ముంచుకుని తినేయడమే. మీకు నచ్చిందా? నచ్చని వారెవరైనా ఉన్నారా?’’ అంటూ ట్వీట్ చేశారు.

ఆయన అలా ట్వీట్ చేయడం.. నెటిజన్లు రెస్పాండ్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. రుచిగా ఉంటే దాని గమ్యం పొట్టే అంటూ ఓ నెటిజన్ రిప్లై ఇచ్చాడు. చెంచాలు, నీళ్ల కొరతకు మంచి ఉపాయం చేశారేనని ఇంకొకరు, చేతులు కడుక్కోవాల్సిన పనిలేదని, నీళ్లను ఆదాచేయొచ్చని మరొకరు కామెంట్ చేశారు.

More Telugu News