New Delhi: రైతుల నిరసనలపై సుప్రీంకోర్టు అసహనం

  • రహదారులపై నిరసనలు ఎలా చేపడతారంటూ ప్రశ్న
  • నిరసనలతో సమస్యలు పరిష్కారం కావని వ్యాఖ్య
  • రైతులను ప్రతివాదులుగా చేర్చాలని కోరిన సొలిసిటర్ జనరల్
  • పిటిషన్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం
supremecourt hearing on pil about farmer protests

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న నిరసనలపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నిరసనల్లో భాగంగా జాతీయ రహదారులను రైతులు దిగ్బంధించడంపై మండిపడింది. ఇలా రహదారులపై నిరసనలు ఎలా చేపడతారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జాతీయ రహదారులను దిగ్బంధించడం సమస్యకు పరిష్కారం కాదని వ్యాఖ్యానించింది. జ్యుడీషియల్ ఫోరం, పార్లమెంటరీ చర్చలతోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొంది.

రహదారుల దిగ్బంధంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని పేర్కొంటూ దాఖలైన ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీనిలో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు.

రైతుల సమస్య పరిష్కరించడం కోసం ఉన్నతస్థాయి కమిటీని నియమించామని, కానీ చర్చలకు నిరసనకారులు అంగీకరించలేదని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే రైతులను ప్రతివాదులుగా చేర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన పిటిషన్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

అంతకుముందు హర్యానా ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేసింది. జాతీయ రహదారిపై ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, రైతులతో చర్చల కోసం ఏర్పాటు చేసిన ప్యానెల్‌ను నిరసనకారులు కలవలేదని హర్యానా ప్రభుత్వం తెలిపింది.

More Telugu News