BCCI: కోహ్లీపై ఏ ఆటగాడూ ఫిర్యాదు చేయలేదు: తేల్చేసిన బీసీసీఐ అధికారి

  • ఇంగ్లండ్ టూర్‌లో కోహ్లీపై సీనియర్ల అసంతృప్తి
  • రహానే, పుజారా ఫిర్యాదు చేశారంటూ కథనాలు
  • కొట్టిపారేసిన బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్
no one complained about kohli to bcci says treasurer

కోహ్లీ కెప్టెన్సీపై కొంతమంది సీనియర్ క్రికెటర్లు అసంతృప్తిగా ఉన్నారని, ఇంగ్లండ్‌ టూర్‌లో ఉండగా కోహ్లీపై వారు బీసీసీఐకి ఫిర్యాదు చేశారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇంగ్లండ్ టూర్‌లో ఉండగా సీనియర్ ఆటగాళ్లు అజింక్య రహానే, ఛటేశ్వర్ పుజారాలు కోహ్లీపై ఫిర్యాదు చేశారని, వీరిద్దరూ బీసీసీఐ సెక్రటరీ జైషాకు నేరుగా ఫిర్యాదు చేశారని వార్తలు వచ్చాయి.

వీటిని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ కొట్టిపారేశారు. మీడియా ఇలాంటి కథనాలను ప్రచురించడం మానుకోవాలని ఆయన సూచించారు. జట్టులో ఏ ఆటగాడూ కోహ్లీపై బీసీసీఐకి రాతపూర్వకంగా కానీ, మౌఖికంగా కానీ ఎటువంటి ఫిర్యాదూ చేయలేదని అరుణ్ స్పష్టం చేశారు.

టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకునే సందర్భంలో కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి. రోహిత్‌ను వైస్ కెప్టెన్‌గా తొలగించాలని కోహ్లీ కోరాడని, ఈ క్రమంలోనే జట్టులో మనస్పర్ధలు వచ్చాయని నాటి వార్తల్లో పేర్కొన్నారు. దీంతో బీసీసీఐ ఈ సమస్యలో జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని, ఫలితంగా కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోబోతున్నాడని కథనాలు వచ్చాయి.

వీటిని కూడా అరుణ్ తప్పుబట్టారు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనే ఆలోచన కోహ్లీ వ్యక్తిగతమైందని, దానిలో బీసీసీఐ పాత్ర ఏమాత్రం లేదని చెప్పారు. ఇప్పుడు సీనియర్ క్రికెటర్లు కోహ్లీపై ఫిర్యాదు చేసినట్లు వచ్చిన వార్తలు కూడా కల్పితాలే అని స్పష్టం చేశారు.

More Telugu News