Corona Virus: ఒకేసారి రెండు టీకాలు.. ఆసుపత్రి పాలైన వృద్ధురాలు!

  • సహచరులతో మాట్లాడుతూ నర్సు నిర్వాకం
  • తమిళనాడులోని కడలూరులో ఘటన
  • దర్యాప్తు చేపట్టిన ఆరోగ్యశాఖ వర్గాలు
nurse administers corona vaccine two times to an old lady

కరోనా భయంతో టీకా తీసుకోవడానికి వచ్చిన వృద్ధురాలు ఆస్పత్రిపాలైంది. నర్సు నిర్లక్ష్యం వల్లే ఆమె అలా ఆస్పత్రిలో పడినట్లు తెలుస్తోంది. తమిళనాడులోని కడలూరు జిల్లా పెన్నాడం ప్రాంతంలో సుబ్రహ్మణ్యం, లక్ష్మి (55) దంపతులు నివసిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆరోగ్యకేంద్రానికి వచ్చిన లక్ష్మి.. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.

ఆమెకు ఒకసారి ఇంజెక్షన్ చేసిన నర్సు.. పక్కనే ఉన్న సహచరులతో మాటల్లో పడి ఆ విషయం మర్చిపోయింది. ఆ వెంటనే మరోసారి లక్ష్మికి టీకా ఇచ్చింది. తనకు రెండుసార్లు వ్యాక్సిన్ ఎందుకిస్తున్నావని లక్ష్మి అడుగుతున్నా కూడా సదరు నర్సు పట్టించుకోలేదు. ఇలా రెండు సార్లు వ్యాక్సిన్ తీసుకోవడంతో లక్ష్మి శరీరం తట్టుకోలేకపోయింది. దీంతో ఆమె స్పృహతప్పింది. అయితే తాను ఒక వ్యాక్సిన్ మాత్రమే ఇచ్చానని సదరు నర్సు బుకాయిస్తోంది.

కానీ లక్ష్మి చేతిపై రెండు చోట్ల రక్తం రావడాన్ని అధికారులు గుర్తించారు. ఆమెను వెంటనే ఆస్పత్రిలో చేర్పించి నిపుణుల పర్యవేక్షణలో ఉంచారు. ఈ విషయం తెలిసిన ఆరోగ్యశాఖ అధికారులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News