Enforcement Directorate: ఈడీ విచార‌ణ‌కు ఇప్పుడు హాజ‌రు కాలేను.. అధికారుల‌కు స‌మాచారం పంపిన ర‌కుల్‌

  • డ్రగ్స్ కేసులో సెప్టెంబరు 6న విచారణ
  • వరుస షూటింగులతో బిజీగా ఉన్నానన్న హీరోయిన్
  • హాజరవడానికి గడువు కోరిన రకుల్ 
  • ఇప్పటికే పూరి జగన్నాథ్, చార్మి హాజరు
Rakul preet singh asks for time to face ED

తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతున్న డ్రగ్స్ వ్యవహారంలో ఈడీ విచారణ ఎదుర్కొనేందుకు ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్ సమయం కోరింది. ఈ నెల 6వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ముందు రకుల్ హాజరుకావలసి ఉంది. అయితే వరుస షూటింగులతో తాను ఫుల్ బిజీగా ఉన్నానని చెప్పిన ఈ స్టార్ హీరోయిన్.. తనకు కొంత గడువు ఇవ్వాలని అడిగిందట.

 నాలుగేళ్ల క్రితం టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. అప్పుడు దీనిపై విచారణ జరిపిన ఎక్సైజ్ శాఖ.. కేసుతో సంబంధం ఉన్న ప్రముఖులను సుదీర్ఘంగా విచారించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసును ఈడీ టేకప్ చేసింది. ఈ క్రమంలోనే మనీలాండరింగ్ చట్టం కింద 12 మంది సెలెబ్రిటీలకు నోటీసులు జారీ చేసింది.

వీరిలో ఆగస్టు 31న పూరి జగన్నాథ్, సెప్టెంబర్ 2న చార్మి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత ఈ నెల 6న రకుల్ ప్రీత్ సింగ్, 8న రానా దగ్గుబాటి, 9న రవితేజతోపాటు శ్రీనివాస్, 13న నవదీప్‌తోపాటు ఎఫ్ క్లబ్ మేనేజర్, 15న ముమైత్ ఖాన్, 17న తనీశ్, 20న నందు, 22న తరుణ్ విచారణకు హాజరవ్వాల్సి ఉంది.

More Telugu News