Hollywood: ఉద్యోగులకు ఐటీ కంపెనీ బంపరాఫర్.. వెబ్ సిరీస్ చూసేందుకు సెలవు!

  • సాకులు చెప్పి సెలవులు పెట్టేస్తారని తెలుసంటూ సరదా ప్రకటన
  • జైపూర్‌కు చెందిన ప్రైవేటు కంపెనీ నిర్ణయం
  • శుక్రవారం నాడు స్ట్రీమ్ కానున్న ‘మనీ హీస్ట్’ 5వ సీజన్
IT company offers leave to employees so they can watch web series

గతంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కబాలి’ సినిమా రిలీజైనప్పుడు ఎలాంటి వాతావరణం ఉందో గుర్తుందా? ఆ సినిమా రిలీజ్ రోజు దేశంలోని చాలా కంపెనీలు ఉద్యోగులకు సెలువులు కూడా ప్రకటించాయి. ఇదిగో మళ్లీ ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. అయితే ఇదేదో ఇండియన్ హీరో సినిమా కాదు. స్పానిష్ వెబ్ సిరీస్ ‘మనీ హీస్ట్’.

ఈ వెబ్ సిరీస్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ప్రేక్షకాదరణ ఉందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వెబ్ సిరీస్ 5వ సీజన్ శుక్రవారం స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే ఈ సిరీస్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఒక ఐటీ కంపెనీ తన ఉద్యోగులను ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకుంది. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ కానున్న శుక్రవారం నాడు తమ ఉద్యోగులందరికీ సెలవు ఇచ్చేసింది.

ఈ మేరకు వెర్వ్ లాజిక్ అనే కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటన నెట్టింట వైరల్ అవుతోంది. ఉద్యోగులంతా ఏవో కుంటి సాకులు చెప్పి సెలవులు పెట్టేస్తారని, కొంతమంది ఫోన్లు కూడా స్విచాఫ్ చేసేస్తారని తమకు తెలుసంటూ కంపెనీ సీఈవో అభిషేక్ జైన్ ఈ లేఖలో పేర్కొన్నారు. అందుకే తానే ముందుగా అందరికీ సెలవు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు.

‘నెట్‌ఫ్లిక్స్ అండ్ చిల్ హాలీడే’ కింద ఈ సెలవు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ సరదా ప్రకటన నెట్‌ఫ్లిక్స్ సంస్థకు కూడా తెలిసింది. దీంతో అభిషేక్ నిర్ణయాన్ని అభినందించింది. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

More Telugu News