Elgar Parishad case: ముంబైలోని ప్రత్యేక కోర్టులో ఎల్గార్ పరిషత్ కేసులో అభియోగాలు సమర్పించిన ఎన్ఐఏ

  • తేల్చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ
  • జేఎన్‌యూ, టీఐఎస్ఎస్ వంటి యూనివర్సిటీల నుంచి విద్యార్థుల రిక్రూట్‌మెంట్
  • 15 మందిపై నిందితులపై 17 కేసులు
Elgar Parishad case Student recruitment for terrorism only

దేశంలో సంచలనం రేపిన ఎల్గార్ పరిషత్ కేసులో కీలక సమాచారం వెలుగుచూసింది. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ), టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్) వంటి ప్రముఖ యూనివర్సిటీల నుంచి ఉగ్రవాద కార్యకలాపాల కోసమే కొందరు విద్యార్థులను రిక్రూట్ చేసుకున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆరోపించింది.  

ఈ మేరకు ముసాయిదా చార్జ్‌షీట్‌ను ముంబైలోని ప్రత్యేక కోర్టు ముందు ఉంచింది. ఎల్గార్ పరిషత్-మావోయిస్టు లింక్ కేసులో ఈ చార్జ్ షీట్ నమోదైంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వాళ్లు ఉగ్రవాద కార్యకలాపాల కోసమే విద్యార్థులను కలుపుకున్నారని ఎన్ఐఏ తన చార్జ్ షీట్‌లో తెలిపింది. భారత ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం చేసి ‘జనతా సర్కార్’ను ఏర్పాటు చేయడమే నిందితుల లక్ష్యమని ఎన్ఐఏ పేర్కొంది.

2017 డిసెంబరు 31న పూణేలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో విద్వేష పూరిత ప్రసంగాలు చేసిన కేసుతో ఎల్గార్ పరిషత్ కేసుకు సంబంధం ఉంది. ఈ ప్రసంగాలు చేసిన మరుసటి రోజే కోరెగావ్-భీమా స్మారకం వద్ద హింసాత్మక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు నిషేధిత ఉగ్రవాద సంస్థ సీపీఐ (మావోయిస్ట్)తో సంబంధాలున్నాయని ఎన్ఐఏ ఆరోపించింది.

ఈ క్రమంలోనే కేసులోని 15 మంది నిందితులపై 17 కేసులు వేసింది. వీరిలో సుధా భరద్వాజ్, వెర్నాన్ గాన్‌సాల్వెస్, వరవరరావు, హనీ బాబు, ఆనంద్ తెల్టుంబ్డే, షోమా సేన్, గౌతమ్ నవ్లాఖా తదితరులు నిందితులుగా ఉన్నారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన స్టాన్ స్వామి కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు. అయితే ఈ ఏడాది జులై 5న ఆయన గుండెపోటుతో మృతిచెందారు.

More Telugu News