Joe Biden: ఆఫ్ఘ‌న్‌లో ప‌రిస్థితుల‌పై జీ-7 దేశాల స‌మావేశం నిర్వ‌హించాల‌ని జో బైడెన్‌, బోరిస్ జాన్స‌న్ నిర్ణ‌యం

  • ఫోనులో మాట్లాడుకున్న‌ జో బైడెన్, బోరిస్‌ జాన్సన్
  • కార్యాచ‌ర‌ణ రూపొందించేందుకు వ‌చ్చే వారం స‌మావేశం
  • ఆఫ్ఘ‌న్‌లో నిఘా కొన‌సాగించాల‌ని నిర్ణ‌యం
biden speaks with johnson

ఆఫ్ఘ‌నిస్థాన్‌ తాలిబ‌న్ల చేతుల్లోకి వెళ్లిపోవ‌డంతో ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అభివృద్ధి చెందిన దేశాలు ఈ అంశంపై చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని భావిస్తున్నాయి. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్ ఫోనులో మాట్లాడుకున్నారు.  

ఉమ్మడి వ్యూహం, కార్యాచరణ రూపొందించేందుకు వచ్చే వారం జీ-7 దేశాల వర్చువల్‌ సమావేశం నిర్వహించాలని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు వైట్‌హౌస్ ఓ ప్ర‌క‌ట‌న చేసింది. ఆఫ్ఘ‌నిస్థాన్ నుంచి తమ పౌరులను, ఆ దేశంలో అమెరికాకు ఇన్నాళ్లు స‌హ‌క‌రించిన ఆఫ్ఘ‌న్‌ జాతీయులను విమానాల్లో తరలించడంలో అమెరికా ద‌ళాలు చూపిన చొర‌వ‌పై కూడా బైడెన్‌, జాన్స‌న్ మాట్లాడుకున్నార‌ని, సేన‌ల‌పై ప్ర‌శంస‌లు కురిపించార‌ని చెప్పారు.

ప్ర‌పంచంలోని ఇతర ప్రజాస్వామ్య దేశాలతో కలిసి ఆఫ్ఘ‌న్‌లోని పరిణామాలపై నిఘా కొనసాగించాలని ఇరు నేత‌లు అభిప్రాయ‌ప‌డ్డార‌ని శ్వేత‌సౌధం పేర్కొంది. ఆఫ్ఘ‌న్‌లోని ప్ర‌జ‌ల‌ రక్షణకు ప్ర‌పంచ దేశాలు సాయం అందించాల్సి ఉంద‌ని బైడెన్‌, జాన్స‌న్ అన్నార‌ని తెలిపింది. అలాగే, ఆఫ్ఘ‌న్ ప‌రిణామాల‌పై అమెరికా ప‌లు దేశాల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతోంది.

More Telugu News