Postman: భారత్‌లో అత్యంత విలువైన సాస్ స్టార్టప్‌గా అవతరించిన పోస్ట్‌మ్యాన్

  • కొత్తగా 225 మిలియన్ డాలర్ల పెట్టుబడులు
  • తాజా పెట్టుబడితో 5.6 బిలియన్ డాలర్లకు చేరిన కంపెనీ విలువ
  • ఏడాది క్రితం కంపెనీ విలువ 2 బిలియన్ డాలర్లే
Postman who has emerged as the most valuable sauce startup in India

భారతదేశానికి చెందిన ప్రముఖ స్టార్టప్ కంపెనీ పోస్ట్‌మ్యాన్.. దేశంలోనే అత్యధిక విలువ కలిగిన సాస్ (సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్) స్టార్టప్‌ కంపెనీగా నిలిచింది. అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్‌ఫేస్ (ఏపీఐ) ప్లాట్‌ఫాం అయిన ఇది తాజాగా 225 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సేకరించింది. దీనిలో ఇప్పటికే పెట్టుబడిదారు అయిన ఇన్‌సైట్ పార్టనర్స్‌ ఈ ఫండింగ్‌కు సారధ్యం వహించింది.

దీంతోపాటు కోట్యూ, మేరీ మీకర్స్‌కు చెందిన బాండ్ క్యాపిటల్, బ్యాటరీ వెంచర్స్ కూడా తలో చెయ్యి వేయడంతో పోస్ట్‌మ్యాన్ పెట్టుబడులు భారీగా పెరిగాయి. దీంతో ఈ కంపెనీ విలువ 5.6 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ క్రమంలోనే భారత్‌లో అత్యంత విలువైన సాస్ స్టార్టప్‌గా పోస్ట్‌మ్యాన్ అవతరించింది. ఇంతకాలం అగ్రస్థానంలో ఉన్న బ్రౌజర్‌స్టాక్‌ను అధిగమించింది.

సాస్‌ విభాగానికి సింబల్‌గా ఉన్న ఫ్రెష్‌వర్క్స్ ప్రస్తుత విలువ 3.5 బిలియన్ డాలర్లు కాగా, ఈ కంపెనీ త్వరలో అమెరికాలో ఐపీవోకు వెళ్లబోతుంది. ప్రస్తుతం భారత్‌లో అత్యంత విలువైన సాస్ స్టార్టప్‌గా మారిన పోస్ట్‌మ్యాన్‌ సంస్థను 2014లో స్థాపించారు. గతేడాది ఈ కంపెనీ విలువ 2 బిలియన్ డాలర్లు మాత్రమే. అయితే విదేశీ పెట్టుబడి దారులు ఇటీవలి కాలంలో భారతీయ స్టార్టప్‌లపై ఫోకస్ పెంచిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే పోస్ట్‌మ్యాన్‌లో పెట్టుబడులు పెరగడం గమనార్హం. ఈ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా 1.7 కోట్లమంది యూజర్లు ఉన్నారు. మొత్తం 5 లక్షల కంపెనీలు కూడా ఈ ప్లాట్‌ఫాంను ఉపయోగించుకుంటున్నాయి. దీన్ని బిట్స్ పిలాని గ్రాడ్యుయేట్ అభినవ్ ఆస్థానా, ఎన్ఎస్ఐటీ ఢిల్లీకి చెందిన అంకిత్ సోబ్తి కలిసి స్థాపించారు. వీళ్లిద్దరూ అంతకుముందు యాహూ ఇండియాలో కలిసి పనిచేశారు. ఆ తర్వాత బయటకు వచ్చేసి పోస్ట్‌మ్యాన్‌ను స్థాపించారు.

More Telugu News