Om Birla: కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెంకన్న దర్శనం చేసుకున్న లోక్ సభ స్పీకర్

  • ఏపీలో లోక్ సభ స్పీకర్ ఆధ్యాత్మిక పర్యటన
  • నిన్న రాష్ట్రానికి వచ్చిన ఓం బిర్లా
  • ఈ ఉదయం తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం
  • తీర్థప్రసాదాలు అందించిన అర్చకులు
  • స్పీకర్ వెంట వైసీపీ ఎంపీలు
Lok Sabha speaker Om Brila offers prayers at Tirumla shrine

ఏపీలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్యాత్మిక పర్యటన కొనసాగుతోంది. నిన్న రాష్ట్రానికి వచ్చిన ఆయన వరుసగా ఆలయాలను సందర్శిస్తున్నారు. ఈ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి దర్శనానికి వచ్చిన లోక్ సభ స్పీకర్ కు ఆలయవర్గాలు స్వాగతం పలికాయి. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్న ఓం బిర్లా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

లోక్ సభ స్పీకర్ వెంట టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, డాక్టర్ గురుమూర్తి తదితరులు ఉన్నారు. వెంకన్న దర్శనం అనంతరం ఓం బిర్లా మీడియాతో మాట్లాడారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని దేవుడ్ని ప్రార్థించానని వెల్లడించారు. కరోనా నుంచి ప్రజలను రక్షించాలని కోరుకున్నానని తెలిపారు. తిరుమలలో భక్తులకు టీటీడీ కల్పిస్తున్న ఏర్పాట్లు బాగున్నాయని ఆయన ప్రశంసించారు.

More Telugu News