America: అధికారం చేపట్టి ఆరు నెలలైనా ఇమ్రాన్‌తో మాట్లాడని బైడెన్.. రగిలిపోతున్న పాక్ ప్రధాని

  • ఆవేదన వ్యక్తం చేసిన పాక్ జాతీయ భద్రతా సలహాదారు
  • తమకూ ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని ఆక్రోశం
  • ఇంకా చాలా దేశాలతో బైడెన్ మాట్లాడాల్సి ఉందన్న అమెరికా అధికారులు
Pakistan has other options PM Imran Khan s adviser tells US

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రగిలిపోతున్నారట. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ అధికారం చేపట్టి ఆరు నెలలు దాటినా తనతో ఇప్పటి వరకు వ్యక్తిగతంగా మాట్లాడకపోవడమే అందుకు కారణమని తెలుస్తోంది. పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారు మొయీద్ యూసుఫ్ మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్థాన్ విషయంలో పాకిస్థాన్ ఎంతో కీలకమని, అలాంటిది ఇమ్రాన్‌తో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇంతవరకు మాట్లాడలేదని అన్నారు.

ఇది ఎలాంటి సంకేతాలను ఇస్తుందో అర్థం చేసుకోగలమని, అమెరికా తమను ఇలాగే అశ్రద్ధ చేస్తుంటే తమకూ మార్గాలు ఉంటాయని చెప్పడాన్ని చూస్తుంటే బైడెన్‌పై ఇమ్రాన్ ఎలా రగిలిపోతున్నదీ అర్థం చేసుకోవచ్చు. బైడెన్ నుంచి ఫోన్ కాల్ వస్తుందని అమెరికా అధికారులు చెబుతున్నారని, కానీ ఇంతవరకు ఎలాంటి ఫోన్ కాల్ రాలేదని మొయీద్ యూసుఫ్ పేర్కొన్నారు.

ఇలా ఎందుకు జరుగుతోందో తమకు అర్థం కావడం లేదన్నారు. బైడెన్ నుంచి ఫోన్ కాల్ రావడం అన్నదే ప్రాధాన్యంతో కూడిన విషయం అనుకుంటే, రక్షణ బంధం కూడా అటువంటిదే అన్నారు. అలాంటప్పుడు పాకిస్థాన్‌కు కూడా ప్రత్యేక మార్గాలు ఉన్నాయని యూసుఫ్ చెప్పినట్టు ‘డాన్’ పత్రిక పేర్కొంది. అయితే, బైడెన్ ఇంకా అనేక దేశాల నేతలతో మాట్లాడాల్సి ఉందని, త్వరలోనే పాక్ ప్రధానితోనూ మాట్లాడతారని అమెరికా అధికారులు చెబుతున్నారు.

More Telugu News