Pakistan: భారత జనాభా 300 కోట్లట.. పాక్​ ప్రధాని ఉవాచ.. ఆడుకుంటున్న నెటిజన్లు: వీడియో వైరల్​

  • ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ కామెంట్
  • డబ్ల్యూటీసీ ఫైనల్ ను గుర్తు చేసిన ఇమ్రాన్
  • 50 లక్షల జనాభా ఉన్న దేశం ఓడించిందని వ్యాఖ్య
Pak PM Imran Khan Says India Population 300 Crore

భారత జనాభా ఎంత? రమారమి ఓ 136 కోట్లు ఉంటుంది కదా. కానీ, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఏమో 300 కోట్లు అనేశారు. ఆ సంఖ్య చెప్పేటప్పుడూ ముందుగా ఒక సంఖ్య చెప్పి.. ఆ తర్వాత దీనికి ఫిక్స్ అయ్యారు. అప్రతిష్ఠపాలై నెటిజన్లతో తిట్టించుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతోంది.

ఇటీవల వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ జరిగింది కదా. అందులో న్యూజిలాండ్ జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఆ ఫైనల్ గురించి ఆయన గుర్తు చేశారు. ‘‘40–50 లక్షల జనాభా ఉన్న ఓ చిన్న న్యూజిలాండ్..  100 (తడబడి ఆగి).... 300 కోట్ల జనాభా ఉన్న భారత్ ను ఓడించింది’’ అని అన్నారు.  

దీంతో నెటిజన్లు, పాక్ జనాలు ఆయనపై వ్యంగ్యాస్త్రాలను ఎక్కుపెట్టేశారు. అవునవును నిజమే అంటూ కొందరు, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో చదివి వచ్చిన వ్యక్తిని చూసి నవ్వుతారా? అది నిషిద్ధమంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత తెలివైన వ్యక్తి మా ప్రధాని అని సెటైర్లు వేస్తున్నారు.

More Telugu News