Jagan: ఆగస్టు 16 నుంచి స్కూళ్లు తెరవాలి: ఏపీ సీఎం జగన్ ఆదేశాలు

  • ఆగస్టు 16న నాడు-నేడు పనులను ప్రజలకు అంకితం చేయాలి
  • పాఠశాలల అభివృద్ధిపై గతంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదు
  • వైసీపీ ప్రభుత్వం స్కూళ్ల అభివృద్ధికి పెద్ద పీట వేస్తోంది
Schools in Andhra Pradesh to reopen on August 16

ఆంధ్రప్రదేశ్ లో క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో, పాఠశాలలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు విద్యాశాఖకు సంబంధించి నాడు-నేడు కార్యక్రమం జరిగింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆగస్టు 16 నుంచి పాఠశాలలను ప్రారంభించాలని చెప్పారు. అదే రోజున నాడు-నేడు పనులను ప్రజలకు అంకితం చేయాలని ఆయన అన్నారు. నాడు-నేడు పనుల్లో అవినీతికి తావుండకూడదని చెప్పారు. పాఠశాలల అభివృద్ధిపై గతంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి పెద్ద పీట వేస్తోందని చెప్పారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజునే రెండో విడత నాడు-నేడు పనులకు శ్రీకారం చుడతామని తెలిపారు.

సమావేశానంతరం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాతో మాట్లాడుతూ... ఆగస్టు 16న పాఠశాలలను పునఃప్రారంభిస్తామని, ఆ రోజున అనేక కార్యక్రమాలను పండుగలా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. తొలి విడత నాడు-నేడు కార్యక్రమం కింద 15 వేలకు పైగా స్కూళ్లను తీర్చిదిద్దామని తెలిపారు. రెండో దశ కింద 16 వేల స్కూళ్లను అభివృద్ది చేస్తామని చెప్పారు.

More Telugu News