Asaduddin Owaisi: సమాజాన్ని విషపూరితం చేస్తున్నారు: ఆర్ఎస్ఎస్ చీఫ్ పై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం

  • ట్విట్టర్ లో స్పందించిన ఒవైసీ
  • అందరి డీఎన్ఏ ఒకటే అంటున్నారని వెల్లడి 
  • అయితే జనాభా లెక్కలెందుకని ఆగ్రహం
  • 1950-2011 మధ్య ముస్లిం జనాభా తగ్గిందని వివరణ
Asaduddin Owaisi fires on RSS Mohan Bhagwat

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై ధ్వజమెత్తారు. ముస్లిం జనాభాను పెంపొందించేందుకు 1930 నుంచి వ్యవస్థీకృత ప్రయత్నం జరుగుతోందని మోహన్ భగవత్ అంటున్నారని ఒవైసీ మండిపడ్డారు. ఒకవేళ అందరి డీఎన్ఏ ఒకటే అయితే, జనాభా గణన ఎందుకని ప్రశ్నించారు. భారతీయ ముస్లింల జనాభా అభివృద్ధి రేటు 1950 నుంచి 2011 మధ్య కాలంలో విపరీతంగా పడిపోయిందని వివరించారు. తమపై చేస్తున్న ఆరోపణల ద్వారా సంఘ్ పెద్దలకు మెదడు సున్నా శాతం, ముస్లింలపై ద్వేషం 100 శాతం అని అర్థమవుతోందని ఒవైసీ విమర్శించారు.

ముస్లింలపై విద్వేషం సంఘ్ పరివార్ కు ఓ వ్యసనంలా పరిణమించిందని, తద్వారా సమాజాన్ని విషపూరితం చేస్తున్నారని మండిపడ్డారు. "మనందరం ఒకటే అని భగవత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆయన అనుచరులను తీవ్రంగా నిరాశ పరిచాయి. దాంతో, అతను తిరిగి తన పాత పంథాకు వచ్చేశారు. ముస్లింలను దెయ్యాలుగా అభివర్ణిస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఇది ఆధునిక భారతం... ఇందులో హిందుత్వానికి స్థానం ఉండరాదు" అని అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.

More Telugu News